- యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడి
- లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేసిన యశోద హాస్పిటల్ డాక్టర్లు
సికింద్రాబాద్, వెలుగు : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడితో సికింద్రాబాద్ యశోదా డాక్టర్లు కొత్త జీవితాన్నిచ్చారు. ఈ వివరాలను శుక్రవారం యశోదా హాస్పిటల్స్ డాక్టర్లు మీడియాకు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా ముర్రాయిగూడెంనకు చెందిన రోహిత్(23) వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్కు తీసుకొచ్చారు. పురుగుల మందు తాగడం వల్ల రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింది.
అతడి లంగ్స్లో విషకణాలు చేరడంతో పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడింది. రోహిత్ ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో యశోదా డాక్టర్లు వెంటనే అతడిని వెంటిలేటర్పై ఉంచి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిర్ణయించారు. పూర్తిగా పాడైపోయిన రోహిత్ లంగ్స్ ను రీప్లేస్ చేసేందుకు జీవన్ దాన్ను సంప్రదించారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషెంట్ ఊపిరితిత్తులు రోహిత్కు మ్యాచ్ కావడంతో వెంటనే అతడిని వాటికి అమర్చి ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేసిన రెండ్రోజుల్లోనే రోహిత్ కోలుకున్నాడన్నారు.
ఇలాంటి సందర్భంలో ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 4 మాత్రమే ఉన్నాయని, అందులో ఎక్కువ కాలం జీవించి ఉన్న కేసు ఇదే మొదటిదన్నారు. దేశంలో ఇదే మొదటి ఆపరేషన్ అని తెలిపారు. ‘డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా రోహిత్కు సరికొత్త జీవితాన్ని అందించామన్నారు. సమావేశంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్, డాక్టర్ కె. ఆర్. బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ విమి వర్గస్తో పాల్గొన్నారు.