గంటల కొద్ది ఆపరేషన్.. కొండల్లో భీకర పోరు

గంటల కొద్ది ఆపరేషన్.. కొండల్లో భీకర పోరు
  • పీఎల్జీఏ బెటాలియన్2ను మట్టుబెట్టిన భద్రతాబలగాలు
  • 18 మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో 9 మంది మహిళలు

భద్రాచలం, వెలుగు: ఎత్తయిన కొండల్లో ఏకంగా 23 గంటల పాటు భద్రతాబలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు సైతం చనిపోయారు. చత్తీస్​గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్​స్టేషన్ పరిధిలోని కచిల్​వార్​-పోటేనార్ గ్రామ అడవుల్లో బుధ, గురువారాల్లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ నంబర్2 బెటాలియన్​మొత్తాన్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. 

ఈ ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతం నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన డీఆర్జీ హెడ్​కానిస్టేబుల్ మోనూ వడారి, కానిస్టేబుళ్లు రమేశ్ సోడి, దుకారు గోండిల మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.

ఎన్​కౌంటర్​ మృతులు వీరే!

రెండు రోజుల పాటు గంగులూరు అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను బస్తర్​ ఐజీ సుందర్​రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ గురువారం వెల్లడించారు. పీఎల్​జీఏ బెటాలియన్ నంబర్2 ఇన్​చార్జ్ మోడియం వెల్లా(45), కీలక నేతలు రేణు కుర్సం(40), సన్నూ అవలం(35), నందా మోడియం(35), లాలూ(32), రాజు పూనెం(29), కామేశ్​ కవ్వాసి(33), లక్ష్మీ తాతి(22), బండి మండవి(30), సుక్కీ లోకాం(33), సోమ్డీ కుంజా(27), చందూ కుర్సం(25), మాసే అలియాస్ శాంతి(22), రీనా మర్కాం(26), సోనీ మడవి(20), సంగీత పదాం(21)ని గుర్తించారు. ఒక మహిళా, పురుష నక్సలైట్​ను ఇంకా గుర్తించలేదు.

భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎన్​కౌంటర్ ప్రదేశాల నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎల్ఎంజీ 1, ఏకే-47లు 4, ఎస్ఎల్ఆర్​లు 4, ఇన్సాస్​ ఒకటి, 303 రైఫిల్స్ 2, సింగిల్ బోర్ రైఫిల్స్ 4, బీజీఎల్ లాంచర్లు 2, మజిల్ లోడింగ్ రేడియో ఒకటి, రేడియో, స్కానర్, మల్టీమీటర్, హ్యాండ్ గ్రేనెడ్, సేఫ్టీ ఫ్యూజ్, విప్లవసాహిత్యం, పోచ్, మెడికల్ కిట్స్, నిత్యావసర సరుకులు ప్రదర్శించారు.