మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం.. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం.. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచం అంతా చూసే ఈవెంట్.. ప్రపంచ సుందరీమణులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్టాత్మక పోటీలు. అలాంటి ఈవెంట్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్ తో నిర్వహిస్తోంది. ఒకవైపు ఇండియా - పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో ఇప్పటికే ఐపీఎల్ ను వారం పాటు వాయిదా వేసింది బీసీసీఐ. దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మిస్ వరల్డ్-2025 పోటీలను కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాతీసుకున్న మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రేపు (శనివారం, మే 10) గచ్చిబౌలి స్టేడియం లో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉన్నందున.. ఈ కార్యక్రమనికి టూరిజం శాఖ పాస్ లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు.

ఈవెంట్ కు సంబంధించి ప్రెస్ మీట్ లో డీసీపీ వినీత్ మాట్లాడారు. ‘‘స్టేడియం లో జరిగే ఈవెంట్ కు 300 నుండి 350 మంది పోలీసులు బందబాస్త్ లో ఉంటారు. ఇప్పటి వరకు 103 మంది కంటెస్టెంట్స్ వచ్చినట్లు సమాచారం ఉంది. దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టైట్ సెక్యురిటి ఏర్పాటు చేశాము. గచ్చిబౌలి స్టేడియం, hicc, కంటెస్టెంట్స్ బస చేసే హోటల్స్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశాము. భద్రతకు సంబంధించి తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ సీపీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు’’ అని తెలిపారు. 

ఈవెంట్ నిర్వహిస్తున్న ఏరియాలో భారీ బందోబస్తు ఉంటుందని చెప్పారు. మాదాపూర్ పరిధిలో మొత్తం 500 మంది బందోబస్తులో ఉంటారని అన్నారు. మాదాపూర్ జోన్ పరిధిలో కమ్యూనియల్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టినట్లు చెప్పారు. విదేశాల నుండి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రయాణించే రూట్స్ మొత్తం ట్రాఫిక్, లా ఎండ్ ఆర్డర్ పోలీసులు కో ఆర్డినెట్ చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పారు.