ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ప్రొఫెసర్  హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదయింది.   2002 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం  యూఏపీఏ ((UAPA) కింద కేసు నమోదు చేశారు.  యూఏపీఏ ((UAPA), ఆర్మ్స్  యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.  మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని కేసు నమోదు చేశారు.  ప్రజాప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపించారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా  పోలీసులు ఈ కేసు వివరాలు బయటపెట్టారు.

తనపై దేశ ద్రోహం కేసు పెట్టడంపై స్పందించారు ప్రొఫెసర్ హరగోపాల్.తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లాంటి సందర్భాల్లో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. దేశద్రోహం , రాజద్రోహం కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తనపై పెట్టిన దేశద్రోహం కేసు చెల్లదని హరగోపాల్ అన్నారు. 152 మందిపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు.  యూఏపీఏ చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సింది కాదన్నారు. దీనిపై లీగల్ గా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టులకు తమ మద్దతు అవసరం లేదన్నారు. ఎక్కడో పేరుందని ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. యూఏపీఏ చట్టాన్ని ఎత్తేయాలన్నారు. 

 ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు పెట్టడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విద్యావేత్తలపై దేశద్రోహం కేసు పెట్టడం సరైంది కాదన్నారు. హరగోపాల్ లాంటి వ్యక్తులను యూఏపీఏ కేసుల్లో ఇరికించడం వెనుక కుట్ర ఉందన్నారు.