- నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, వెలుగు: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియను జిల్లా ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని నిర్మల్కొత్త కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో జనగణన-2027, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జనగణన దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, జనాభా గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ విధానాలను రూపొందిస్తాయని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతి కుటుంబం బా ధ్యతాయుతంగా పాల్గొని సరైన సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రజలకు “సెల్ఫ్ ఎన్యుమరేషన్” సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. మొబైల్ నంబర్తో లాగిన్ అయి కుటుంబసభ్యుల వివరాలు సహా మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, సీపీవో జీవరత్నం, డీపీఆర్వో విష్ణువర్ధన్, అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

