ముంబై: బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మొదటిసారిగా 50 వేల పైన క్లోజయ్యింది. విదేశీ ఇన్వెస్ట్మెంట్ల ఇన్ఫ్లోస్ కొనసాగుతుండడంతో బుధవారం సెషన్లో సెన్సెక్స్ 458 పాయింట్లు పెరిగి 50,226 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 50,526.39 పాయింట్ల వద్ద ఆల్టైమ్ హైని టచ్ చేసింది. 14,868.85 పాయింట్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకిన నిఫ్టీ, చివరికి 142 పాయింట్లు పెరిగి 14,790 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇండియన్ మార్కెట్లు బుల్స్ కంట్రోల్లో ఉన్నాయని, ఇండెక్స్లు బుధవారం రికార్డ్ గరిష్టాలను టచ్ చేశాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ బినోద్ మోడీ అన్నారు. బడ్జెట్ బాగుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో డబ్బులు పెడుతున్నారని, దీనికి తోడు గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలుండడంతో మార్కెట్లు లాభపడుతున్నాయని చెప్పారు. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్లకు చేరువలో ఉందని పేర్కొన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పెంచుతూనే, బడ్జెట్లో రీఫార్మ్స్ను ప్రభుత్వం ప్రకటించిందని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇక నుంచి కూడా మెరుగ్గా ఉంటాయని అంచనావేసిన ఆయన, యూఎస్ స్టిబ్యులస్ ప్యాకేజి, ఫెడ్ వడ్డీరేట్లను మార్చకపోవడం, డాలర్ బలహీనంగా ఉండడం వంటి అంశాలు మార్కెట్లు పెరగడానికి కారణమయ్యాయని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ మార్కెట్లకు కదలికలకు కీలకంగా ఉంటుందని చెప్పారు.
- సెన్సెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్గా నిలిచింది. ఈ షేరు 8 శాతం లాభపడింది. ఆ తర్వాత పవర్ గ్రిడ్, డా.రెడ్డీస్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.
- అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, నెస్లే, టీసీఎస్ షేర్లు అధికంగా నష్టపోయాయి.
- 1.9 బిలియన్ డాలర్ల యూఎస్ స్టిమ్యులస్ ప్యాకేజి త్వరలో వస్తుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు పెరగగా, షాంఘై నెగిటివ్లో ముగిసింది.
- డాలర్ మారకంలో రూపాయి విలువ 72.95 వద్ద ఫ్లాట్గా ముగిసింది. బ్రెంట్ క్రూడ్ 0.36 శాతం పెరిగి బ్యారెల్ 58.01 డాలర్ల స్థాయికి చేరుకుంది.