ముంబై: సెన్సెక్స్, నిఫ్టీలు వరసగా రెండో సెషన్లోనూ లాభపడ్డాయి. మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్ట్మెంట్ల రాక కొనసాగుతుండడంతో పాటు, గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు శుక్రవారం లాభాల్లో ఓపెన్ అయ్యాయి. కానీ, ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి కిందకి పడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 60 వేల మార్క్ను టచ్ చేసి చివరికి 105 పాయింట్ల (0.18 శాతం) లాభంతో 59,793 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 17,833 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లో టెక్ మహీంద్రా టాప్ ఫెర్మార్గా వరసగా రెండో రోజూ కొనసాగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఎస్బీఐ, టీసీఎస్, విప్రో షేర్లు కూడా ఎక్కువగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 79.57 వద్ద సెటిలయ్యింది.
ప్రాఫిట్ బుకింగ్తో కిందకి..
గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించడంతో లోకల్ మార్కెట్లు మంచి లాభాలతో శుక్రవారం ట్రేడింగ్ను ప్రారంభించాయని, సైకలాజికల్ లెవెల్ అయిన 60 వేలను సెన్సెక్స్ టచ్ చేశాక ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఈసీబీ వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో పాటు, ఫెడ్ వైఖరీకి తగ్గట్టు గ్లోబల్ ఇండెక్స్లు అడ్జెస్ట్ అవుతున్నాయని అన్నారు. వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్ ఈ వారం 990 పాయింట్లు (1.68 శాతం) పెరిగింది. నిఫ్టీ 294 పాయింట్లు లాభపడింది. మార్కెట్పై బుల్లిష్ అవుట్లుక్ను కొనసాగిస్తున్నామని, షేర్ల ధరలు తగ్గినప్పుడు కొనండని సలహాయిస్తున్నామని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్గా చూస్తే షాంఘై, టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. యూరప్లోని మెజార్టీ మార్కెట్లు మధ్యాహ్నం సెషన్లో భారీగా పెరిగాయి.