హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అశ్వత్థామ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ యూనియన్కు పోటీ చేసే అర్హత లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మజ్దూర్ యూనియన్కు సంబంధించిన కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుతోపాటు పదో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణలో ఉందని, అందుకే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదని రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అశ్వత్థామ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. ఈ ఎన్నికల్లో ఏ యూనియన్ పేరుతో పోటీ చేయబోతున్నామనేది 17న ప్రకటిస్తామని తెలిపారు.
