- మృతులు నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగడంతో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రంగా గాయాలు కాగా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇందర్గంజ్ ప్రాంతం రోష్ని ఘర్ రోడ్లోని పెయింట్ షాపులో ఉదయం 10 గంటలకు మంటలు అంటుకోగా.. కొద్ది నిమిషాల్లోనే బిల్డింగ్ అంతటా వ్యాపించాయని అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. దీంతో రెండో ఫ్లోర్లో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. ఫైర్ ఇంజన్ల సాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశామన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పెయింట్ షాపు ఓనర్స్ అయిన గోయల్ ఫ్యామిలీ మెంబర్సే చనిపోయినట్లు తెలుస్తోంది.