తాడిచెర్ల బొగ్గు తవ్వేకొద్దీ అనుమానాలు

తాడిచెర్ల బొగ్గు తవ్వేకొద్దీ అనుమానాలు
  • 30 ఏండ్లు లీజుకిచ్చిన జెన్​కో
  • ఉద్యమం టైమ్​లో వద్దని ఆందోళనలు.. ఇప్పుడు కాంట్రాక్టర్లకు అప్పగింత
  • బొగ్గు క్వాలిటీ బాగున్నా 
  • లో గ్రేడ్​ అంటూ రిపోర్టులు
  • కన్వేయర్ బెల్ట్ బదులు 
  • బ్లాక్​లో దందా
  • ఏటా వేల కోట్లు ధారాదత్తం

హైదరాబాద్, వెలుగు: 

రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం వేయొద్దని, సింగరేణికే అప్పగించాలని పట్టుబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏడేండ్ల కిందటే  సిరులు కురిపించే తాడిచెర్ల బొగ్గు బ్లాక్​ను ప్రైవేటుకు కట్టబెట్టింది. టీఎస్​ జెన్​కోకు కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్​ను.. సింగరేణికి బదులుగా ఏఎంఆర్ కంపెనీకి 30 ఏండ్లపాటు లీజుకు ఇచ్చింది. టీఆర్​ఎస్ సర్కార్​హయాంలో జరిగిన ఈ బొగ్గు బాగోతం మరో ఇరవై ఏండ్ల పాటు యథేచ్ఛగా సాగనుంది. దీంతో వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గు నిల్వల దోపిడీకి దారులు వేసినట్లైంది.

అప్పడు వద్దని.. ఇప్పుడు ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వం 2005లో క్యాప్టివ్ మైనింగ్ కింద భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్​ను  జెన్​కోకు కేటాయించింది. జెన్ కోకు కేటాయించిన గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో పీఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ 2011లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తాడిచెర్ల గనుల వ్యవహారం సంచలనం రేపింది. స్పందించిన అప్పటి సీఎం రోశయ్య పీఎల్ఆర్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేసి తాడిచర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టాలని సింగరేణి సీఎండీకి లెటర్ రాశారు. కార్మికులకు ఉపాధితో పాటు సింగరేణి కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న తాడిచెర్ల బ్లాక్​.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ప్రైవేటు పాలైంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే 2015లో జెన్ కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి ఈ బ్లాక్​ను అప్పగించటం సందేహాలకు తావిచ్చింది.

చేతులెత్తేసిన జెన్ కో.. అప్పగింతలు 

చట్ట ప్రకారం తాడిచెర్ల ఓసీ కోల్‌‌‌‌ మైనింగ్‌‌‌‌ చేపట్టాల్సిన జెన్‌‌‌‌కో సంస్థ దానికి తగినట్లుగా ఉద్యోగులను నియమించుకోవాలి. మిషనరీ ఏర్పాటు చేసుకోవాలి. ఓపెన్ కాస్ట్ నుంచి కన్వేయర్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ ద్వారా 18 కి.మీ దూరంలో ఉండే చెల్పూర్‌‌‌‌ లోని కేటీపీపీకి ఏడాదికి 25 లక్షల టన్నుల బొగ్గును తరలించాలి. ఇవన్నీ తమకు భారమని జెన్​కో చేతులెత్తేసింది. కానీ సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీకి లీజుకివ్వటం బొగ్గు దోపిడీ దందాను బయటపెట్టినట్లయింది. అందుకే నాలుగేండ్లు గడుస్తున్నా ఇక్కడ కన్వేయర్‌‌ బెల్ట్‌‌ నిర్మాణం జరపలేదు. ఇప్పటికీ 60 కిలోమీటర్లు లారీల ద్వారా చెల్పూర్‌‌ కేటీపీపీకి బొగ్గు రవాణా జరుగుతోంది.

కెపాసిటీ లేకున్నా ప్రైవేటుకే

సింగరేణితో పోలిస్తే ఈ ప్రైవేటు కంపెనీ సామర్థ్యం తక్కువ. జెన్​కో అవసరానికి సరిపడేంత బొగ్గును ఇప్పటికీ అందించలేకపోతోంది. అయినా.. ఈ కంపెనీకి జెన్​కో మొగ్గు చూపటం, ఏటేటా వందల కోట్లు కట్టబెట్టడం పట్ల కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 2018 నుంచి ఈ కంపెనీ బొగ్గు సరఫరా మొదలుపెట్టింది. 2018‒19లో 7.57 లక్షల మెట్రిక్‌‌ టన్నులు, 2019‒20లో 16.55 లక్షల మెట్రిక్‌‌ టన్నులు, 2020‒21లో 20.17 లక్షల మెట్రిక్‌‌ టన్నులు, 2021‒22లో థర్డ్‌‌ క్వార్టర్‌‌ ముగిసే నాటికి 16.64 లక్షల మెట్రిక్‌‌ టన్నుల బొగ్గును చెల్పూర్‌‌ కేటీపీపీకి సప్లై చేసింది. ఈ బ్లాక్​లో  జీ-7, జీ8 గ్రేడ్​  బొగ్గు ఉత్పత్తి అవుతుందని ప్రతి టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3,500, ఒక్కోసారి టన్నుకు రూ.4 వేల వరకు జెన్ కో నుంచి బిల్లులు తీసుకుంటోంది. బొగ్గు గ్రేడ్‌‌ మారితే డబ్బుల చెల్లింపు పెరుగుతుంది. ఇలా ప్రతీ యేటా పేమేంట్‌‌ విషయంలో అగ్రిమెంట్‌‌ మార్చుకునేలా రెండు సంస్థల మధ్య  ఒప్పందం ఉంది.  గడిచిన నాలుగేళ్లలోనే  కోట్లల్లో దందా జరిగితే.. ఇంకా 26 ఏళ్లలో బొగ్గు దోపిడీ ఎంత మేరకు జరుగుతుందో  ఊహించుకోవచ్చు.

నిర్వాసితుల నోట్లో మట్టి

ఈ బ్లాక్ ను ప్రైవేటు కంపెనీకి అప్పగించటంతో నిర్వాసితులు నష్టపోయారు. ఏఎంఆర్‌‌ సంస్థ సుమారు 1,400 మంది ఉద్యోగులను తాత్కాలిక ఒప్పందంపై నియమించుకొని పనులు చేస్తుంది. వీరిలో భూ నిర్వాసితులు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ బయటినుంచి వచ్చిన ఉద్యోగులే. అదే సింగరేణికి అప్పగిస్తే నిర్వాసితులకు న్యాయం జరిగేదని.. కంపెనీ లాభాలతో పాటు జెన్​కోకు నాణ్యమైన బొగ్గు రవాణా అయ్యేదని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి సేకరించిన 913 హెక్టార్ల భూమిలో ఇక్కడ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ.. తాడిచెర్ల నుంచి చెల్పూర్‌‌ కేటీపీపీ వరకు కన్వేయర్​బెల్ట్ కోసం 15 మీటర్ల వెడల్పు భూసేకరణ పెండింగ్‌‌ ఉన్నట్లుగా ఏఎంఆర్‌‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఓసీ కోసం 2,300 ఎకరాల భూములు సేకరించిన  జెన్‌‌ కో కన్వేయర్‌‌ బెల్ట్‌‌కు సరిపడే భూసేకరణ మాత్రం చేయకపోవటం అంతుపట్టని విషయంగా మారింది.

హైదరాబాద్​లో  తప్పుడు రిపోర్టులతో ప్రైవేట్​కు లైన్​ క్లియర్​​

గనిలో కేవలం 47.93 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నట్లు గతంలో గుర్తించారు. ఎక్కువ లోతులో తక్కువ బొగ్గు నిక్షేపాలున్నాయని, స్ట్రిపింగ్ రేషియో 1:8 గా ఉందని, లో గ్రేడ్ బొగ్గు అని, ఇక్కడ బొగ్గు వెలికితీస్తే సింగరేణి నష్టపోతుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. కానీ ఈ బ్లాక్​లో 80 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయని, మంచి గ్రేడ్ బొగ్గు ఉందనే విషయాలు ఇటీవల వెలుగుచూశాయి. మైన్ స్టార్ట్‌‌‌‌ అయిన మూడేళ్లలోనే 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలోనే పుష్కలంగా బొగ్గు నిల్వలు, ఏ గ్రేడ్‌‌‌‌ క్వాలీటి బొగ్గు ఉన్నట్లు బయటపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఆఫీసర్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చి తాడిచెర్ల బ్లాక్​ ప్రైవేటుకు లీజ్ కిచ్చారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


సింగరేణి ఆదాయానికి గండి కొట్టారు

తాడిచెర్ల ఓసీపీని ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తుంటే అన్ని సింగరేణి కార్మిక సంఘాలు పోరాటం చేసి అడ్డుకోవడం జరిగింది. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి సింగరేణికి కేటాయించేలా కృషి చేశాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేసేందుకు జెన్ కోకు కేటాయించి సింగరేణి ఆదాయానికి గండి కొట్టారు.

‒ పసునూటి రాజేందర్, ఐఎన్​టీయూసీ 
కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, భూపాలపల్లి

రాష్ట్ర సర్కార్ వల్లే ప్రైవేటుకు

రాష్ట్ర సర్కార్ వల్లే సింగరేణికి రావాల్సిన తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ప్రైవేట్‌‌ సంస్థ చేతికి వెళ్లింది. తాడిచర్ల బ్లాక్​ ను జెన్​కో చేజిక్కించు కొని ప్రైవేటుకు అప్పగించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. బ్లాక్ ప్రారంభమై నాలుగేండ్లవుతున్నా ఇప్పటి వరకు కన్వేయర్ బెల్టు ప్రారంభించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఆలస్యం వెనుక ఎవరి జేబులు నిండుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు బయటకి వస్తాయి.

‒ కంపేటి రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర 
వైస్ ప్రెసిడెంట్, భూపాలపల్లి బ్రాంచ్ సెక్రటరీ