- బాధితురాలి ఫిర్యాదు.. మరిపెడ ఎస్సై శ్రీనివాస్రెడ్డి సస్పెన్షన్
- పొద్దున ఎస్పీ నుంచి రివార్డు.. సాయంత్రానికి చర్యలు
మహబూబాబాద్, వెలుగు: దళిత మహిళా ట్రైనీ ఎస్సైని లైంగికంగా వేధించాడని ఆరోపణలు రావడంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి ఐజీ నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మహిళా ఎస్సై.. 16 రోజులుగా మరిపెడ పోలీస్ స్టేషన్ లో ట్రైనీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బెల్లం అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు తనకు శ్రీనివాస్రెడ్డి ఫోన్ చేశాడని, నమ్మి వెళ్తే తన సొంత కారులో మరిపెడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, ఎలాగొలా తప్పించుకొని బయటపడ్డానని వరంగల్ అర్బన్ జిల్లా సీపీ తరుణ్ జోషికి ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై విచారణకు సీపీ ఆదేశించారు. శ్రీనివాస్రెడ్డిపై లైంగిక వేధింపులు, ఇతర సెక్షన్ల కింద మరిపెడ పీఎస్లో కేసు నమోదు చేశామని మహబూబాబాద్జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. కేసు విచారణ కోసం తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. బాధిత మహిళా ట్రైనీ ఎస్సైని ట్రైనింగ్ పూర్తి చేసేందుకు ఆమె సొంత జిల్లా జయశంకర్ భూపాలపల్లికి అటాచ్ చేసినట్లు సమాచారం.
పొద్దున రివార్డు
శ్రీనివాస్రెడ్డి భారీగా నల్ల మందును పట్టుకోవడంతో మంగళవారం పొద్దున 11 గంటలకు ఎస్పీ ఆఫీసులో ఎస్పీ కోటిరెడ్డి ప్రశంసించి రివార్డు అందించారు. కానీ మధ్యాహ్నం కల్లా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు.