దళిత బంధు లీడర్లకే తప్ప ప్రజలకు కాదు : మాజీమంత్రి షబ్బీర్​అలీ

దళిత బంధు లీడర్లకే తప్ప ప్రజలకు కాదు : మాజీమంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీముల పేరిట ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ విమర్శిచారు. గురువారం రామారెడ్డి మండలం మద్దికుంటలో గడపగడపకు కాంగ్రెస్​ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ​ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్​పాంప్లెంట్స్​ను ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధులు బీఆర్ఎస్​ పార్టీ లీడర్లకే తప్ప, సామాన్య ప్రజలకు కాదన్నారు. కామారెడ్డి ప్రజలకు కేసీఆర్​ను ఓడించే సువర్ణావకాశం వచ్చిందన్నారు.  

మద్దికుంట బుగ్గరామలింగేశ్వర టెంపుల్​కు కాంగ్రెస్​హయాంలోనే రాష్ర్టస్థాయి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ పేదలకు భూములు పంచితే, కేసీఆర్​ ప్రభుత్వం ఫారెస్ట్​ ఆఫీసర్లతో ట్రెంచులు కొట్టించి భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్​  అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి అందిస్తామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు, రామారెడ్డి జడ్పీటీసీ  మోహన్​రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, లీడర్లు నర్సాగౌడ్, ప్రవీన్, లచ్చిరెడ్డి, లింగం, చిన్న రాజు పాల్గొన్నారు.