హైదరాబాద్: ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ పోలీసులు. 5 కేసులకు సంబంధించి నిందితుడి వద్దనుంచి 7 తులాల బంగారు, 6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ ఎసిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. “మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కు చెందిన ముదావత్ రవినాయక్ సరూర్ నగర్ లో నివాసం ఉంటూ మాదాపూర్ పిఎస్ లో హోంగార్డుగా పనిచేసేవాడు. చెడువ్యసనాలకు బానిసైన రవినాయక్ డబ్బు కోసం స్నాచింగ్ లకు పాల్పడుతూ పట్టుబడి గతంలోనే జైలుకు వెళ్లాడు
జైలుశిక్ష పడిన రవినాయక్ ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో.. మళ్లీ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. మరో గుర్తుతెలియని మహిళతో కలసి శంషాబాద్ లో పలుచోట్ల దొంగతనాలు చేశాడు. దీంతో మంగళవారం ఎస్ఓటి పోలీసులతో కలిసి శంషాబాద్ పోలీసులు రవినాయక్ను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల పిఎస్ ల పరిధుల్లో రవినాయక్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడని” ఏసీపీ వెల్లడించారు.