ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? : వైఎస్ షర్మిల

ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? : వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లున్నదో సొసైటీల ముందట ఎరువుల కోసం నిలుచున్న రైతన్నలను అడిగితే తెలుస్తుందన్నారు. ఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులకు 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామంటూ ఊదరగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రగతి భవన్ వేదికగా.. రైతుల సాక్షిగా హామీ ఇచ్చి ఆరేండ్లు దాటినా దొర మాటకు విలువ లేదన్నారు. ఉచితం మాట అటుంచితే ఎరువులు కొందామన్నా దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు వైఎస్ షర్మిల. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రాజకీయాలు పక్కనబెట్టి రైతులు పడుతున్న కష్టాలను చూడండని చెప్పారు. తక్షణమే ఎరువుల కొరత లేకుండా చూడాలని కోరారు. ఈ ఖరీఫ్ కైనా ఉచిత ఎరువులు ఇచ్చి మాటను నిలబెట్టుకోవాలని కోరారు.