మొహాలీ : టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డును నెలకొల్పారు. మొహాలీ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేల్లో ఆసీస్ పై వెయ్యి రన్స్ పూర్తి చేసిన ఫస్ట్ భారత ఓపెనర్లుగా నిలిచారు. భారత్ స్కోరు 62 రన్స్ దగ్గర ఈ జోడి ఈ రికార్డును సొంతం చేసుకుంది. వెస్టిండీస్ మాజీ ఆటగాళ్లు గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్ ఇదివరకు ఆసీస్ పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఓపెనర్లుగా ఉన్నారు. సచిన్, గంగూలీ జంట 827 రన్స్ చేసి మూడో స్థానంలో ఉంది. రోహిత్, శిఖర్ మొహాలీలో 15వ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పగా వన్డేల్లో అత్యథిక సెంచరీలు చేసిన జోడీగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
అంతకుముందు గంగూలీ, సచిన్ 21 సెంచరీ భాగస్వామ్యాలు చేయగా వారి తర్వాతి స్థానంలో ఆడం గిల్ క్రిస్ట్, మాథ్యూహెడెన్ 16 సెంచరీ భాగస్వామ్యాలు చేశారు. అలాగే.. ఆసీస్ పై అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు (5) చేసిన ఆటగాళ్లుగా రోహిత్, శిఖర్ధావన్ అగ్రస్థానంలో నిలిచారు. వారి తర్వాత గ్రీనిడ్జ్, రిచర్డ్స్ నాలుగు సెంచరీలతో రెండోస్థానంలో ఉన్నారు. అలాగే మూడో స్థానంలో VVS లక్ష్మణ్, సచిన్ నాలుగు సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరల్డ్ కప్ కు ముందు తిరిగి ఫామ్ లోకి రావడంతో టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.