
ముంబై: హిందీ భాష వివాదం మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తున్నది. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర సర్కారుపై పోరాటం కోసం 20 ఏండ్ల తర్వాత ఒక్కటైన సోదరులు, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీజేపీ నేతలు పోస్టులు పెడుతున్నారు.
తాను మహారాష్ట్రలో మరాఠీని.. భారత్లో హిందువును అంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే గతంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘భుజాలపై కాషాయ రంగు శాలువా ధరించి, తనను తాను ‘మరాఠీ’, ‘హిందువు’ అని చెప్పుకుంటూ.. మనం భాష గుర్తింపుల కంటే హిందుత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి” అని ఆ వీడియోలో బాల్ థాక్రే పేర్కొన్నారు.
ఈ వీడియోను షేర్ చేస్తూ పలువురు బీజేపీ నేతలు.. తండ్రి సిద్ధాంతాలకు భిన్నంగా కొడుకులు భాషా రాజకీయాలు చేస్తున్నారంటూ ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేను విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైమరీ స్కూల్స్లో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడాన్ని ‘విజయంగా’ అభివర్ణిస్తూ ఇటీవల ముంబైలో ఉద్ధవ్, రాజ్ కలిసి ఓ సభను ఏర్పాటు చేశారు.
రాబోయే ముంబై నగర పాలక సంస్థ (సివిక్ బాడీ) ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం హిందీని ప్రజలపై రుద్దడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని వారు స్పష్టం చేశారు. అప్పటినుంచీ వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.