పంజాబ్ లోని పాటియాలాలో వెరైటీ క్రైమ్ జరిగింది. జ్యువెలరీ షాప్ లో దొంగలు పడి.. టీవీ చోరీ చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బోర్ కొట్టి టీవీ మాత్రమే కొట్టుకెళ్లారా.. లేక టీవీల దొంగలా అని పోలీసులు కూడా షాకవుతున్నారట. రోజు రోజుకీ బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న ఈ సమయంలో జ్యువెలరీ షాపులో చోరీ చేసిన ఆ దొంగలు నగలను అసలు టచ్ చేయలేదు. ఈ ఘటన బుధవారం రాత్రి పాటియాలాలో జరిగింది.
పాటియాలాలోని పూరీ మార్కెట్ ఏరియాలో ఉన్న వికాస్ వర్మ అనే వ్యక్తికి చెందిన బంగారు నగల షాపులో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. కేవలం రూ.7 వేల టీవీని మాత్రమే ఎత్తుకెళ్లి.. ఖరీదైన నగల్ని వదిలేశారు. గురువారం ఉదయం షాపు యజమాని పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. టీవీని ఎత్తుకెళ్తున్న దొంగలను ఆ పక్కనే ఉన్న షాపు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు తమ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.