
- ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు
- ఏటా సీటు కోసం పేరెంట్స్ క్యూ
- కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బోధన
- విద్యార్థుల సంఖ్యలో రాష్ట్రంలో థర్డ్ ప్లేస్
సిద్దిపేట, వెలుగు : ప్రస్తుత కాలంలో సర్కారు బడికి పిల్లలను పంపాలంటేనే తల్లిదండ్రులు నామోషీ అనుకుంటారు. ఆ సర్కార్ బడిలో మాత్రం అడ్మిషన్లు తీసుకోబడవు అని బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో అత్యధిక విద్యార్థులతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ ఘనత ఇది. ఇందులో ప్రవేశాలకు తల్లిదండ్రులు క్యూ కడుతుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడో రోజే అడ్మిషన్లు కంప్లీట్ అయ్యాయి. స్కూల్ లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం 23 సెక్షన్లలో 1,219 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా మంచి ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేస్తుండటం గమనార్హం. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడితో ఆరు, ఏడు తరగతులను నాలుగు సెక్షన్ల చొప్పున, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఐదేసీ సెక్షన్ల చొప్పున ఏర్పాటు చేశారు.
ఎంట్రెన్స్ ద్వారానే అడ్మిషన్
ఇందిరానగర్ హైస్కూల్ లో ఆరో తరగతిలో చేరాలంటే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈసారి నాలుగు సెక్షన్లలో160 సీట్ల కోసం రెండు రోజుల కింద టెస్ట్ నిర్వహించగా, 650 మంది విద్యార్థులు రాశారు. ముందుగా ఎగ్జామ్ కోసం ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకుంటారు. ఎగ్జామ్ లో ఎంపికైతే.. ముందుగా సింగిల్ పేరెంట్, పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో సిఫార్సు లెటర్లు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సెక్షన్లు పెంచితే మరింత మంది విద్యార్థులు చేరే చాన్స్ ఉన్నా బోధనా సిబ్బంది, సౌకర్యాల కొరత రావద్దనే ఉద్దేశంతో పరిమిత సంఖ్యలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు.
అధునాతన సౌకర్యాలు
దాతల సాయంతో స్కూల్లో అధునాతన సౌకర్యాలను కల్పించారు. నాట్కో సంస్థ ఆధ్వర్యంలో ఆరు అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు డిజిటల్ ల్యాబ్ , కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు, ఆన్ లైన్ క్లాసులు, మెస్ హాల్ వంటి తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. స్కూల్ లో ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఆన్ లైన్ లోనూ చూసే సదుపాయం ఉంది. విద్యార్థులకు ఇఫ్లూ ఆధ్వర్యంలో ఫారెన్ లాంగ్వేజెస్ లో ఫ్రెంచ్, స్పానిష్ భాషలను బోధిస్తుండటం గమనార్హం.
ఉత్తమ ఫలితాలతో పెరిగిన క్రేజ్
జడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తుండడంతో ఏటేటా అడ్మిషన్ల కోసం భారీగా క్రేజ్ పెరుగుతుంది. గతేడాది టెన్త్ లో 274 మంది విద్యార్థుల్లో 70 మందికిపైగా 500 మార్కులకు పైగా సాధించారు. గతేడాది 32 మంది, ఈ ఏడాది 17 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు పొందారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లాస్థాయిలో తొలి పది స్థానాల్లో ఐదుగురు ఈ స్కూల్ విద్యార్థులే ఉండడం గమనార్హం. స్కూల్ లో డిజిటల్ కంటెంట్ విద్యా విధానం అమలుకు మాజీ మంత్రి హరీశ్ రావు సహకరించగా ప్రధానమంత్రి పథకానికి స్కూల్ ఎంపికైంది.
విద్యలో ఎంతో మెరుగైనా..
స్కూల్ లో అడ్మిషన్ కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను. ఐదో తరగతి వరకు ప్రైవేటు స్కూల్ లో చదివిన నేను ఇక్కడ అడ్మిషన్ పొందడం ద్వారా విద్యలో ఎంతో మెరుగుపడ్డాను. ప్రతి ఒక్క విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధను చూపుతూ టీచర్లు బోధించడంతో పాటు ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉంది. ఈ స్కూల్ నా కెరీర్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నా. - ఎండీ సమీ, టెన్త్ స్టూడెంట్
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బోధన
ఇందిరానగర్ ప్రభుత్వ స్కూల్ లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులకు అర్థం కాకుంటే పలుమార్లు అర్థమయ్యేలా టీచర్లు చెబుతుంటారు. ఈ స్కూల్ లో చదువుతున్నందుకు గర్వంగా ఉంది. - కుంచం వెన్నెల, టెన్త్ స్టూడెంట్
సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు
టీచర్ల సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ లో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టూడెంట్స్ కు అర్థమయ్యేలా చదువు చెప్పడంతో పాటు, స్కూల్ లో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ప్రతిభ చూపిన వారికే అడ్మిషన్లు ఇస్తున్నాం. - ఎ. రాజప్రభాకర్ రెడ్డి, హెడ్ మాస్టర్, ఇందిరానగర్ హై స్కూల్