హుస్నాబాద్, వెలుగు: రాబోయే 6 నెలల్లో జిల్లా అంతటా పూర్తి స్థాయి సీసీ టీవీ నెట్వర్క్ గ్రిడ్ తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. గురువారం అడ్మిన్ డీసీపీ కుశల్కర్తో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ విస్తరణతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతోందని, దీంతో అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది డ్యూటీ చేయడంతో పాటు పేపర్ వర్క్ పూర్తి చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఆధారంగా మరింత ఫోర్స్ను, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
మార్చి 2న ప్రారంభించిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ ప్రాజెక్ట్ ద్వారా 90 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. ఊరూరా నిఘాను విస్తరిస్తున్నామని, సిద్దిపేట కమిషనరేట్ కమాండ్ కంట్రోల్కు ప్రతి జంక్షన్ను కనెక్ట్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ సదానందం, సీఐలు శ్రీధర్, రమేశ్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, తోట మహేశ్, అభిలాష్, ప్రశాంత్, ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
