తన గురువు గెలిచిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ను అందుకొని కెరీర్ ను పరిపూర్ణం చేసుకోవాలనుకున్న ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు ఆశ నెరవేరలేదు. మెగా టైటిల్ పై కన్నేసి కొన్ని నెలలుగా కఠోరంగా శ్రమించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆల్ ఇంగ్లండ్ తొలి రౌండ్ లోనే ఓడి ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ లో ఐదో సీడ్ సింధు 16-–21, 22–-20, 21–-18తో అన్ సీడెడ్ కొరియా ప్లేయర్ సంగ్ జి హ్యున్ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 25 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో రెండో గేమ్ లో మూడు సహా మొత్తం ఎనిమిది మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నప్పటికీ సింధు విజయం సాధించలేకపోయింది. ఇక, పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ బోణీ కొట్టారు. తొలి రౌండ్ లో శ్రీకాంత్ 21–13, 21–11తో బ్రైస్ లెవర్డెజ్ (ఫ్రాన్స్ )ను ఓడించగా.. సాయి ప్రణీత్ 21–19, 21–19తో వరుస గేమ్ ల్లో సహచర షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ పై గెలిచాడు. అయితే, మహిళల డబుల్స్ లో సిక్ కిరెడ్డి –అశ్విని పొన్నప్ప, జక్కం పూడి మేఘన–-పూర్విషా రామ్ జంటలు తొలి రౌండ్ లోలోనే నిష్క్రమించాయి . సిక్ కి–అశ్విని జోడీ 21–16, 26–28, 16–21తో ఏడో సీడ్ షిహొ టనాకయెనమొటొ (జపాన్ ) ద్వయం చేతిలో, మేఘనపూర్విషా రామ్ జోడీ 21–18, 12–21, 12–21తో ఎకతరీనా బొలొటోవా–అలినా డెవ్లెటోవా (రష్యా) జంట చేతిలో మూడు గేమ్ ల పాటు పోరాడి ఓడిపోయాయి.
సింధు చేజేతులా..
ఈ మ్యాచ్ కు ముందు ముఖాముఖిల్లో సంగ్ జిహ్యున్ పై 8–6తో మెరుగైన రికార్డుతో ఉన్న సింధు.. ఈ మ్యాచ్ లో దాన్ని కొనసాగించలేక పోయింది. కీలక సమయాల్లో అద్భుతంగా ఆడినా.. మ్యాచ్ లో చాలా భాగం నిరాశ పరిచింది. కోర్టులో దిగాలుగా కనిపించిన ఆమెలో ఆత్మవిశ్వాసం లోపించింది. పదే పదే వైడ్ షాట్లు కొట్టడంతో పాటు షటిల్ ను సరిగ్గా అంచనా వేయలేక ప్రత్యర్థికి సులువుగా పాయింట్లు ఇచ్చుకుంది. నెట్ గేమ్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. స్మాష్ తో తొలి పాయింట్ రాబట్టిన ఐదో సీడ్ తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ ఆరంభంలో ఓవర్ హెడ్ షాట్లు , జంప్ స్మాష్లు కొడుతూ 6–3తో ఆధిక్యం సాధించింది. కానీ, లైన్ జడ్జ్మెంట్ తప్పిదాలు చేయడంతో హ్యున్ 6–6తో స్కోరు సమం చేసింది. ఆపై, బ్యాక్ లైన్ పై ఎక్కువగా షాట్లు కొట్టే ప్రయత్నంలో సింధు వైడ్లు ఆడడంతో కొరియా ప్లేయర్ 11–8తో బ్రేక్ కు వెళ్లింది. విరామం నుంచి వెంటనే సంగ్ ఫోర్ హ్యాండ్ పై బలమైన బాడీలైన్ స్మాష్ సహా నాలుగు పాయింట్ల రాబట్టిన సింధు 12–11తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, జోరు కొనసాగించలేకపోయిన ఆమె పేలవ వైడ్ షాట్లు ఆడి తొలి గేమ్ ను చేజేతులా కోల్పోయింది. ఇక, కోచ్ గోపీ సూచనలతో రెండో గేమ్ లో సింధు తన ఆటను మార్చుకుంది. బేస్ లైన్ మీదుగా డ్రాప్ షాట్లు కొట్టింది. కానీ, కోర్టు లో చురుగ్గా కదిలిన హ్యున్ దీటుగా జవాబిస్తూ11–8తో ఫస్టాఫ్ ను ముగించింది. బ్రేక్ తర్వాత సింధు 14–14తో స్కోరు సమంచేసినా.. హ్యున్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. బ్యాక్ లైన్ టు బ్యాక్ లైన్ షాట్లు ఆడుతూ తెలుగమ్మాయి సహనాన్ని పరీక్షించింది. ఒత్తిడికి గురైన పీవీ.. మరిన్ని పేలవ షాట్లు ఆడడంతో హ్యున్ 20–17తో మ్యాచ్ పాయింట్ పైకి వచ్చింది. ఓటమి ఖాయం అనుకుంటున్న సమయంలో సింధుకు అదృష్టం కలిసిసోచ్చింది. సంగ్ వరుసగా వైడ్ షాట్ల తో మూడు పాయింట్లు కాపాడుకున్న ఐదో సీడ్ .. బలమైన బాడీ స్మాష్ తో గేమ్ నెగ్గి మ్యాచ్ లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్ లో తొలుత 5–7తో వెనుక బడినప్పటికీ.. క్రాస్ కోర్ట్ షాట్ల తో పాటు తన మార్కు స్మాష్ లు సంధిస్తూ సింధు 9–7తో ముందంజ వేసింది. కానీ, దీటుగా బదులిచ్చిన హ్యున్ 11–9తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. బ్రేక్ తర్వా త ఆమె మరింత విజృంభించగా.. ఇండియా ప్లే యర్ పూర్తిగా తేలిపోయి10–17తో వెనుకబడింది. అదే జోరుతో హ్యున్ 20–13తో మ్యాచ్ పాయింట్ పై నిలిచింది. కానీ, రెండో గేమ్ మాదిరిగా ఆమె మరోసారి అతి రక్షణాత్మకంగా ఆడింది. పదే పదే వైడ్లు కొట్టి ఐదు మ్యాచ్ పాయింట్లు కోల్పోయింది. వీటిని సొమ్ము చేసుకున్న సింధు 18–21తో నిలిచి ఆశలు రేపింది. కానీ, చివరకు నెట్ వద్ద ఆమె రిటర్న్ గురి తప్పడంతో హ్యున్ నే విజయం వరించింది.

