
హిందువులు ఏ పూజ చేసినా.. ఏకార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వినాయకుడికి పూజిస్తారు. వినాయకుడి చవితి( చతుర్థి) తిథి అంటే చాలా ఇష్టం.. అందుకే ప్రతి చవితి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జ్యేష్టమాసం కృష్ణపక్షంలో వచ్చే చవితిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అంటారు . ఆ రోజు ( జూన్ 14) ప్రాధాన్యత.. ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. . .
వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ( 2025) కృష్ణ పింగళ హర చతుర్థి జూన్ 14 న వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3:46 గంటలకు ప్రారంభమై జూన్ 15, మధ్యాహ్నం 3:51 గంటలకు ముగుస్తుంది. సంకష్ట చతుర్థి జూన్ 14న శనివారం ఉదయ తిథితో జరుపుకుంటారు.
చంద్రోదయ సమయం : జూన్ 14 రాత్రి 10:07గంటలకు
ఆ రోజున ( జూన్14 ) వినాయక పూజ చేస్తే సర్వవిఘ్నాలు తొలగుతాయని నమ్మకం. గణేశ పురాణంలో అనేక కథల రూపంలో కృష్ణ పింగళ సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణ.. జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.
కృష్ణపింగళ సంకట హర చతుర్ధి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి, చంద్రుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం ముగించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పూజలో గణేశుడికి దర్భ గడ్డి, మోదకం, పండ్లు మొదలైనవి సమర్పించాలి. ఇలా పూజిస్తే గణేశుడి ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
గణేషుడిని విఘ్నాలకధిపతి, దుఃఖార్థ (దుఃఖాలను తొలగించేవాడు) అని పూజిస్తారు . కృష్ణ పింగళ సంకష్ట హర చతుర్థి రోజున( జూన్ 14) భక్తులు అడ్డంకులు, దుఃఖాలను తొలగించడానికి ఉపవాసం ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే గణేషుడిని అడ్డంకులు లేదా సమస్యలను తొలగించే దేవుడిగా పూజిస్తారు. సంకష్ట ఉపవాసం పాటించే ఆచారం 700 BCలో ప్రారంభమైందని నమ్ముతారు.
సంకటహర చతుర్థి ప్రాముఖ్యత
సంకటహర చతుర్థి రోజున భక్తులు గణేశుడి కృష్ణ పింగళ మహా గణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి.
పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవ రాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు. అందువల్ల భక్తుడు గణేశుడి ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. వ్రత కథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజిస్తారు.
చంద్రుడికి సమర్పించాల్సిన నైవేద్యం
కృష్ణపింగళ సంకష్టి చతుర్థి తిథి రోజున చంద్రుడిని పూజించాలి. చంద్రుడికి పచ్చి పాలు సమర్పించండి. ఈ రోజు చంద్రుడిని పూజించడం ద్వారా జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోతాయి.
ఆరోజు పాటించాల్సిన నియమాలు:
- సూర్యోదయానికి ముందుగానే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.
- తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి.
- మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
- సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
- ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
- తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
- సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి.
- వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
- వినాయకుడి పూజలో తప్పని సరిగా గరిక ఉండేవిధంగా చూసుకోవాలి. తులసి దళాలను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు.
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.