
భాద్రపదమాసం మహాలయ పక్షం రోజులు కొనసాగుతున్నాయి. ఈ నెల అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం తీర్చుకోవాలని పండితులు చెబుతున్నారు. మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల్లో ఉంది. మహాలయ పక్షాల్లో అంటే బాధ్రపద మాసం చివరి 15 రోజుల్లో పితృదేవతలకు ఎందుకు శ్రాద్ద కర్మలు నిర్వహించాలి.. వాటి వలన ఉపయోగం ఏమిటి...మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
భాద్రపద మాసం బహుళ పక్షంలో అంటే చివరి 15 రోజులను పురాణాల ప్రకారం మహాలయ పక్షములు అంటారు. ఈ 15 రోజుల కాలంలో పితృ దేవతలు భూమి మీద సంచరిస్తారు. మన నివసించే ఇంటి ఆవరణలో ఆకలితో వేచి చూస్తారు. మరణించిన వారికి తర్పణాల ద్వారా ఆకలి తీరుతుందని పండితులు చెబుతున్నారు.
బాధ్రపదమాసంలో చివరి 15 రోజులు పితృ దేవతలను అర్చించేందుకు ఎంతో ముఖ్యమైన రోజులని పండితులు చెబుతున్నారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులు నిర్వహించాలి. వీటినే పితృపక్షములనీ.., అంటారు.
మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలిని ఈ మహాలయ పక్షాల్లో తీర్చాలి. మరణించిన ప్రాణి ...ఆత్మ... రూపంలో పితృలోకంలో ఉంటుందని గరుడపురాణంలో పేర్కొన్నారు. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది...
మరణిచిన మన పితృ దేవతలకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి...అలా జరగాలంటే .. పితృదేవతలు దేహధారణ చేసి మళ్లీ తిరిగి ఈ లోకం లోకి రావాలి... అలా రావాలంటే వారికి అన్నాన్ని ( తర్పణాలు ) అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి... అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది.
ఋణం తీరడమే ... మోక్షం... అంటే. రేపు మనకైనా ఇంతే... ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం మహాలయంలో పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా..... మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు.
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా? అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు...
మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు అంటుంది శాస్త్రం.
మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు... లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు... లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు... అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి.
సాధారణంగా పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, ( నువ్వులతో) పిండప్రదానం చేస్తారు. కానీ ఈ మహాలయ పక్షాలు... పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే సర్వ కారుణ్య తర్పణ విధి అంటారు.
పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు.
వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి.