ధన్వాడ, వెలుగు : పెండ్లికి ఒక రోజు ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం రాజోలి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రాజోలి గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు మల్లేశ్ (21) ఇంటర్ వరకు చదివి, గొర్లను కాస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి కర్నాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా సెలెట్ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం కాగా, బుధవారం ఉదయం పెండ్లి జరగాల్సి ఉంది.
ఇదిలా ఉండగా మల్లేశ్ నాలుగు రోజులుగా మానసిక ఆందోళనతో ఉండడంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లి వస్తానని చెప్పిన మల్లేశ్.. ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

