
హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ విధంగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటిని విష్ణుమూర్తికి అంకితం చేస్తారు.కానీ జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది.ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు( జూన్ 21 ) ఏ విధంగా పూజ చేయాలి.ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం
జ్యేష్ఠమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. హిందూమతం విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న భక్తుడు స్వర్గలోక ప్రాప్తి పొందుతాడు. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయడంతో సమానమని విశ్వాసం.
యోగిని ఏకాదశి శుభ ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం: జూన్ 21, 2025 ఉదయం 7:18 గంటలకు
ఏకాదశి తిథి సమాప్తం: జూన్ 22, 2025 ఉదయం 4:27 గంటలకు
2025 సంవత్సరంలో, జూన్ 21, శనివారం నాడు యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.
యోగినీ ఏకాదశి పూజా విధానం ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. చేతిలో గంగాజలం తీసుకొని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించండి. పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు.
ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి.
యోగిని ఏకాదశి ఉపవాసం జూన్21 న శ్రీమహావిష్ణువును పూజిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే ప్రత్యేకించి ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ సంపద, ఆనందం ,శ్రేయస్సు పెరుగుతుంది. ఈ రోజున శ్రీ హరివిష్ణువును క్రమపద్ధతిలో పూజించి, ఉపవాసం ఉండి మోక్షాన్ని అందించాలని కోరుకొంటారు. యోగినీ ఏకాదశి వ్రతం పుణ్య ప్రభావం వల్ల పాపాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మరణానంతరం స్వర్గంలో స్థానం లభిస్తుంది. ప్రాపంచిక జీవితంలో ఒక వ్యక్తి తన సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని, కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తద్వారా అతని జీవితం ఏ లోటూ లేకుండా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని వేదపండితులు.. ఆధ్యాత్మికవేత్తల సమాచారంమేరకు .. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.మీకున్న సమస్యలకు వేదపండితులను సంప్రదించడం ఉత్తమం..