
హైదరాబాద్: రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధుశర్మకు ఆమె పెద్ద కూతురైన రిషితను అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింధుశర్మ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వారంలో రెండు రోజులు తండ్రి వద్ద ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం తండ్రి కూతురిని తీసుకెళ్లి.. తిరిగి సోమవారం ఉదయం తల్లి సింధుశర్మకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 4 వరకు ఇదే ప్రక్రియ కొనసాగించాలని పేర్కొంటూ తదుపరి విచారణను హైకోర్టు జూన్ 4కి వాయిదా వేసింది.
పెద్ద కూతురు రిషితను తన భర్త వశిష్ట నుంచి తనకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది సింధుశర్మ. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సింధు శర్మ, ఆమె భర్త వశిష్ట మధ్య గొడవలున్నాయి. ఈ క్రమంలో విడాకులు కావాలని వశిష్ట కోరుతున్నారు. అయితే తాను విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా లేనని సింధుశర్మ హైకోర్టుకు చెప్పినట్లుగా సమాచారం.