ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటన ఇంకా క్లియర్ కాలేదు. ఈ నెలాఖరులో జరగనున్న ప్రపంచస్థాయి సదస్సుకు హాజరుపై అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇది చాలా ముఖ్యమైన పర్యటన అని సింగపూర్ వెళ్లకుండా ముఖ్యమంత్రిని ఆపడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేజ్రీవాల్ పర్యటనకు సంబంధించి ఆమ్ ఆద్మీపార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. కేజ్రీవాల్ను సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ జూన్లో వరల్డ్ సిటీ సమ్మిట్ కు హాజరవ్వాలని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ఢిల్లీ సీఎం అంగీకరించారు. అయితే ఆయన పర్యటనకు ఇంకా అనుమతి రాలేదు. ప్రపంచ స్థాయి సదస్సులో ఢిల్లీ మోడల్ను ప్రదర్శించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వం తమను ఆహ్వానించిందని కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు.