సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి : విష్మిత తేజ్‌‌

సింగరేణి, ఎన్టీపీసీ సమన్వయంతో ముందుకెళ్లాలి :   విష్మిత తేజ్‌‌

జ్యోతినగర్, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎన్టీపీసీ, తెలంగాణ సూపర్‌‌ థర్మల్‌‌ విద్యుత్‌‌ ప్రాజెక్ట్‌‌ను కేంద్ర బొగ్గుగనుల శాఖ అడిషనల్‌‌ సెక్రటరీ విష్మిత తేజ్‌‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ కేదార్‌‌ రంజన్‌‌ పాండు ఆమెకు స్వాగతం పలికారు.  అనంతరం ఈడీ, జీఎంలతో కలిసి పవర్‌‌ ప్రాజెక్ట్‌‌లోని బాయిలర్, కంట్రోల్‌‌ రూం, ట్రాక్‌‌ హాపర్‌‌, ప్రాజెక్ట్‌‌ రిజర్వాయర్‌‌లోని 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌‌ సోలార్‌‌ ప్రాజెక్ట్‌‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్‌‌లోని వివిధ విభాగాల పనితీరును చెక్‌‌ చేశారు. రిజర్వాయర్‌‌లో ఫ్లోటింగ్‌‌ సోలార్‌‌ ప్లాంట్‌‌ పనితీరును తెలుసుకొని ప్రశంసించారు. సింగరేణి నుంచి వస్తున్న బొగ్గు, దాని నిర్వహణ, అన్‌‌లోడింగ్‌‌ వంటి అంశాలపై చర్చించారు. ఎన్టీపీసీ, సింగరేణి ఆఫీసర్లతో మీటింగ్‌‌ నిర్వహించి రెండు సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం ప్రాజెక్ట్‌‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డైరెక్టర్‌‌ ఆపరేషన్స్‌‌ ఎన్‌‌వీకే. శ్రీనివాస్, ప్రదీప్‌‌కుమార్‌‌ మిశ్రా పాల్గొన్నారు.