సింగరేణి బిజినెస్‌‌ రూ. 37 వేల కోట్లు!

సింగరేణి బిజినెస్‌‌ రూ. 37 వేల కోట్లు!
  • ఈ ఏడాది -రికార్డు స్థాయిలో బొగ్గు, కరెంట్​అమ్మకాలు
  •     ఫిబ్రవరి నాటికే దాటేసిన గతేడాది టర్నోవర్​
  •     12 శాతం వృద్ధి సాధిస్తామని మేనేజ్‌‌మెంట్ ప్రకటన
  •     అధిక లాభాలపై కార్మికుల్లో ఆశలు

కోల్​బెల్ట్, వెలుగు:  ఈ ఏడాది -రికార్డు స్థాయి బొగ్గు, కరెంట్ అమ్మకాలతో సింగరేణి సంస్థ  రూ.37వేల కోట్ల బిజినెస్ దిశగా దూసుకుపోతోంది.  మరో 10 రోజుల్లో ఫైనాన్స్​ఇయర్​ముగుస్తుండగా..  గతేడాది కన్నా 12శాతం ఎక్కువ టర్నోవర్​సాధిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 30 నాటికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి రీచ్​కావడంతో పాటు రవాణా, విద్యుత్‌‌ అమ్మకాల్లోనూ లక్ష్యం చేరుకోనుంది. ఈసారి బిజినెస్​పెరిగినందున ఆ మేరకు లాభాలు పెరిగి, తమ వాటా కూడా పెరుగుతుందని కార్మికులు ఆశిస్తున్నారు. 

బొగ్గు, విద్యుత్‌‌ అమ్మకాల్లో జోరు

సింగరేణి సంస్థ ఈ యేడు బొగ్గు, విద్యుత్‌‌ అమ్మకాల్లో రూ.37వేల కోట్ల టర్నోవర్​దాటే ఛాన్స్​ కనిపిస్తోంది.  2022-–23లో రూ.33 వేల కోట్ల వ్యాపారం చేసిన సంస్థ.. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌ ఫిబ్రవరి నాటికే గత యేడాది టర్నోవర్‌‌‌‌ను దాటింది. నిరుడు 66 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయగా... ఈ యేడు 70 మిలియన్​ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్‌‌ మార్చి చివరి నాటికి ​రీచ్‌‌ కానుండగా.. రూ.37వేల కోట్లకు పైగా టర్నోవర్ దాటే​అవకాశం కనిపిస్తోంది. గతయేడాది కన్నా 12శాతం వృద్ధితో రూ.4 వేల కోట్ల టర్నోవర్​ను అధికంగా సాధించే వీలుంది.  ఇందులో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.32,500 కోట్లు, విద్యుత్‌‌ అమ్మకాల ద్వారా రూ.4,500 కోట్ల టర్నోవర్​ ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. థర్మల్ పవర్‌‌‌‌తో పాటు సోలార్​ పవర్‌‌‌‌ను కూడా ఉత్పత్తి చేసి అమ్మకాలు జరుపుతుండడంతో టర్నోవర్​ పెంచుకుంటోంది.

పెరగనున్న లాభాలు 

2023–-24 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌‌‌లో నిర్దేశించిన 70 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రోజుకు 2.45 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి, రవాణా టార్గెట్‌‌గా పెట్టింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్​ బలరాంనాయక్​, డైరెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఏరియాల వారీగా లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్‌‌ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. గత యేడాది 33వేల కోట్ల టర్నోవర్​ చేసిన సింగరేణి సంస్థ  రూ.1,222 కోట్ల లాభాలు ఆర్జించింది.  ఈసారి మరో12 శాతం వృద్ధితో రూ.37 వేల కోట్ల టర్నోవర్​ దాటే ఛాన్స్ ఉండటంతో లాభాలు కూడా అదే స్థాయిలో పెరిగే ఛాన్స్‌‌ ఉంది.-------