
- కొత్తగూడెం ఏరియాలో వనమహోత్సవం ప్రారంభం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా 675 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు పెంచుతామని కంపెనీ సీఎండీఎన్. బలరాం నాయక్ తెలిపారు. కొత్తగూడెం ఏరియా జీకే ఓసీ డంప్యార్డ్లోని ఓవర్ బర్డెన్ ప్రాంతంలో ఆదివారం ఆయన మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలో 85 హెక్టార్లలో 3.50 లక్షల మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు తాను స్వయంగా 19 వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట వేస్తోందని, మొక్కల నాటడంతో పాటు సింగరేణి వ్యాప్తంగా కొత్తగా 60 చెరువులను అభివృద్ధి చేశామని చెప్పారు.
ఈ ప్రోగ్రాంలో డైరెక్టర్లు ఎల్వీసూర్యానారాయణ, కె. వెంకటేశ్వర్లు, మోహన చంద్ర పర్గైన్, ఏరియా జీఎం షాలెం రాజు, ఎన్విరాన్మెంట్ జీఎం బి.సైదులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేశ్, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కె.సూర్యానారాయణ, యూనియన్ ప్రతినిధులు గట్టయ్య, ఎండీ రజాక్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు నరసింహారావు, ఏజీఎం హన సుమలత, డీజీఎం శివకేశవరావు పాల్గొన్నారు.