వ్యయ నియంత్రణలో..సింగరేణికి జాతీయ స్థాయి గుర్తింపు.. మెగా పరిశ్రమల విభాగంలో మూడో స్థానం

వ్యయ నియంత్రణలో..సింగరేణికి జాతీయ స్థాయి గుర్తింపు.. మెగా పరిశ్రమల విభాగంలో మూడో స్థానం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి వ్యయ నియంత్రణ చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎమ్ఏఐ) నిర్వహించిన 2024 నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో మెగా పరిశ్రమల విభాగంలో సింగరేణి మూడో స్థానాన్ని సాధించింది. ఈ పురస్కారాన్ని జూన్ 23న ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో అందజేయనున్నట్లు  ఐసీఎమ్ఏఐ అధ్యక్షుడు సీఎంఏ బిభూతి భూషణ్ నాయక్ వెల్లడించారు.  అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనే 12వ జాతీయ విద్యార్థుల స్నాతకోత్సవంలో బహుమతి గ్రహీతలను సత్కరించనున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ నేతృత్వంలోని న్యాయ నిర్ణేతల బృందం సింగరేణిని ఈ పురస్కారనికి ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా  సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణికి దక్కిన జాతీయ గుర్తింపు ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషికి ఫలితమన్నారు. బలరామ్.. ఏడేండ్లు డైరెక్టర్ ఫైనాన్స్‌గా, ఆ తర్వాత చైర్మన్‌గా ఆర్థిక సంస్కరణల ద్వారా వ్యయ నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. బొగ్గు ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో ఆర్థిక వెసులుబాటు చర్యలు, భారీ యంత్రాల విడి భాగాల కొనుగోళ్లలో ఆయన కచ్చితమైన అంచనా ఉత్పాదకతను పెంచాయి. అన్ని ఆర్థిక లావాదేవీలను ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్ ద్వారా పారదర్శకంగా నిర్వహించడం ద్వారా దుబారా వ్యయాలను అరికట్టారు. బొగ్గు అమ్మకాలు, యంత్రాలు, వస్తువుల కొనుగోళ్లు, కార్మికుల జీత భత్యాలు, బోనస్‌లు వంటి కీలక రంగాల్లో ఈ వ్యవస్థ ద్వారా గణనీయమైన వ్యయ నియంత్రణ సాధించారు. గనుల వారీగా వ్యయ నియంత్రణ చర్యలు కూడా సింగరేణి ఈ ఘనత సాధించడంలో కీలకమయ్యాయి.