
- రాష్ట్ర అవసరాలకు పోను మిగులు విద్యుత్ అమ్ముకునేందుకు పర్మిషన్
- ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగం లిమిటెడ్, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ మధ్య అగ్రిమెంట్
- ఇప్పటికే రు. 500 కోట్ల లాభంలో సింగరేణి
- బహిరంగ మార్కెట్ అమ్మకాలతో పెరగనున్న లాభాలు
కోల్బెల్ట్, వెలుగు: ఇన్నాళ్లూ రాష్ట్ర అవసరాలకే విద్యుత్ను సప్లై చేస్తున్న సింగరేణి ఇక నుంచి బహిరంగ మార్కెట్లో సైతం అమ్మడానికి నిర్ణయించింది. ఇందుకోసం టీజీఎస్ఎల్డీసీ పర్మిషన్తో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగం లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మధ్య ఇటీవల ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగం లిమిటెడ్ తరఫున రేణు నారంగ్, సింగరేణి తరఫున ఈ అండ్ ఎం డైరెక్టర్ డి. సత్యనారాయణరావు అగ్రిమెంట్ పేపర్లను మార్చుకున్నారు. ఇలా విద్యుత్ అమ్మగా వచ్చిన లాభాలను రాష్ట్ర డిస్కంలతో పాటు సింగరేణి కాలరీస్ సమానంగా పంచుకోనున్నాయి.
పెరగనున్న లాభాలు
సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. 600 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను 2016 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్ర అవసరాలకు విద్యుత్ను అందిస్తూ ఏటా రూ. 500 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. ఈ పవర్ ప్లాంట్ ఆవరణలోనే మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. రామగుండంలో కూడా మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తే కనీసం రూ.800 నుంచి వెయ్యి కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు సింగరేణి ఏటా తన బొగ్గు గనులు, కార్మిక కాలనీల అవసరాల కోసం సుమారు 750 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుకుంటోంది. ఇందుకు ఒక్కో యూనిట్కు సగటున రూ. 8 చొప్పున ఏటా సుమారు 420 కోట్లు ట్రాన్స్కోకు చెల్లింస్తోంది. ఇప్పుడు పొదుపు చర్యల్లో భాగంగా 300 మెగావాట్ల కెపాసిటీ గల 14 ప్లాంట్లను ఎనిమిది ఏరియాల్లో ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ద్వారా 852 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. దీని వల్ల సింగరేణి సంస్థ చెల్లించిన విద్యుత్ బిల్లులో సుమారు రూ. 300 కోట్లకుపైగా ఆదా అయింది. తాజాగా మిగులు పవర్ను బహిరంగ మార్కెట్లో అమ్మడం వల్ల సింగరేణి లాభాలు మరిన్ని పెరిగే ఛాన్స్ ఉంది.
ఐదేళ్లలో 60 వేల మిలియన్ యూనిట్లు
సింగరేణికి జైపూర్లో 600 మెగావాట్ల కెపాసిటీ గల రెండు థర్మల్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 12 శాతం విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీర్చగలుగుతోంది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గరిష్ట డిమాండ్ 15,485 మెగావాట్లకు చేరడంతో ప్రభుత్వ బహిరంగ మార్కెట్లో విద్యుత్ను కొంటోంది. జైపూర్లోని రెండు ప్లాంట్ల ద్వారా గత ఐదేళ్లలో 60,521 మిలియన్ యూనిట్ల కరెంట్ను రాష్ట్ర గ్రిడ్కు సప్లై చేశారు. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న పవర్లో 90 శాతం రాష్ట్ర అవసరాలకే పోతోంది. మిగిలిన కరెంట్ను బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు ఇప్పుడు అవకాశం దక్కింది.
మరిన్ని ప్లాంట్లపై దృష్టి
రిజర్వాయర్లపై 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, ఓసీపీఐ విండ్ పవర్ ఉత్పత్తికి సింగరేణి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల పవర్ ప్లాంట్కు డీపీఆర్ సిద్ధంగా ఉండగా సర్కార్ అనుమతి కోసం వేచి చూస్తోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్పై 250 మెగావాట్ల చొప్పున రెండు, రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి అధ్యయనం చేస్తోంది. ఇల్లందు సమీపంలోని జేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్కు సింగరేణి ప్రణాళికలు రెడీ చేసింది. ఓసీపీల వద్ద బొగ్గు వెలికితత కోసం తవ్వి తీసిన మట్టి గుట్టలపై విండ్ పవర్ ఏర్పాటుపై దృష్టి సారించింది.