సింగరేణి లీజు బ్లాకుల్లో మిగిలింది 1,633 మిలియన్‌‌ టన్నులే : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం

సింగరేణి లీజు బ్లాకుల్లో మిగిలింది 1,633 మిలియన్‌‌ టన్నులే : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
  • ఐదు ఓసీలు, ఆరు అండర్​గ్రౌండ్‌‌ మైన్స్‌‌ ప్రారంభించేందుకు చర్యలు 
  • సింగరేణి సీఎండీ ఎన్. బలరాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి లీజు ఉన్న బొగ్గు బ్లాకుల్లో 1,633 మిలియన్‌‌ టన్నుల నిల్వలే ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ ఎన్‌‌. బలరాంనాయక్‌‌ చెప్పారు. కొత్తగూడెం కార్పొరేట్‌‌ పరిధిలోని ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, ఎన్‌‌సీసీ, స్కౌట్స్‌‌ అండ్‌‌ గైడ్స్‌‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో కొత్త గనులు రావడం అంత ఈజీ కాదన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్‌‌లో నిలబడాలంటే నాణ్యత పెంచడంతో పాటు ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని సూచించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తేనే సింగరేణికి భవిష్యత్‌‌ ఉంటుందన్నారు.

సింగరేణి లీజు ప్రాంతంలో ఐదు ఓపెన్‌‌ కాస్ట్‌‌లు, ఆరు అండర్‌‌ గ్రౌండ్‌‌ మైన్స్‌‌ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగూడెంలోని వీకే ఓపెన్‌‌ కాస్ట్‌‌, ఇల్లెందులో జేకే, బెల్లంపల్లిలో గోలేటి ఓపెన్‌‌ కాస్ట్‌‌, రామగుండంలో కోల్‌‌మైన్స్‌‌ను ప్రారంభించనున్నామని తెలిపారు. గైర్హాజరు అయ్యే కార్మికులతో పాటు పని దొంగలు, మస్టర్‌‌ పడిన తర్వాత వెళ్లిపోయే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంతో పాటు ఇతర దేశాల్లోనూ బొగ్గు బావులు, కీలక ఖనిజాల తవ్వకాలపై సింగరేణి దృష్టి సారించిందన్నారు. సింగరేణి డైరెక్టర్లు కొప్పుల వెంకటేశ్వర్లు, ఎల్‌‌వీ సూర్యనారాయణ, జీఎం జీవీ.కిరణ్‌‌కుమార్‌‌, సింగరేణి కాలరీస్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ జనరల్‌‌ సెక్రటరీ కె.రాజ్‌‌కుమార్‌‌, సీఎంఓఏఐ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ రాజీవ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.