- పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి అధికారుల సంఘం పోరుబాట పట్టింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి నిరసనలు చేపట్టనుంది. జూన్ 17న రామగుండం, 19న బెల్లంపల్లి, 21న కొత్తగూడెం కార్యాలయాల ముందు ధర్నాలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2022–23 నుంచి ప్రాఫిట్ రిలేటెడ్ పే (పీఆర్పీ) బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో పాటు కోల్ ఇండియా తరహాలో పే స్కేల్ అప్గ్రేడేషన్, సమగ్ర ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని, బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలని, సింగరేణిలో రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట వేయాలని, సంస్థకు రూ.50 వేల కోట్ల బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
