హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం జూన్ రెండో వారంలోగా పరిష్కరించాలని, లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్క్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో వారు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను చెల్లించాలన్నారు. ఈ సంస్థకు నష్టాలు రావడానికి గల కారణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. విద్య, వైద్యరంగంలో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు పెట్టి, వేధించడం సరికాదని పేర్కొన్నారు.
