పురుగుల మందు తాగిన యువ రైతు

పురుగుల మందు తాగిన యువ రైతు

కోనరావుపేట, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో నిబంధనలకు విరుద్ధంగా వేసిన బోరును సీజ్ చేస్తామని రెవెన్యూ అధికారులు బెదిరించడంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు, గ్రామస్తులు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన గుర్రం రాజిరెడ్డి, ఇతడి కొడుకు గుర్రం నవీన్ పొలంలో ఇటీవల బోరు వేసుకొని సాగు చేసుకుంటున్నారు.

దీంతో పక్క రైతులు తమ బావికి దగ్గర బోరు వేశాడని.. తహసీల్దార్, సెస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆర్ఐ రాజశేఖర్, సెస్ సిబ్బంది పరిశీలించి బావికి 100 మీటర్లు దాటి బోరు వేసుకోవాలని, పర్మిషన్ లేకుండా వేసిన బోరును సీజ్ చేస్తామని చెప్పారు. బోరు కనెక్షన్ కట్ చేయడంతో రాజిరెడ్డి కొడుకు  నవీన్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు, ఆర్ఐ రాజశేఖర్ సిరిసిల్ల ఏరియా హాస్పిటల్​కు తరలించారు.