హైదరాబాద్, వెలుగు: కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ట్రైబల్ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్) నిర్వహణలో కొచ్చిలో వచ్చే నెలలో ఈ ట్రైనింగ్ మొదలుకానుంది. ఈ శిక్షణలో తెలంగాణ నుంచి 25 మంది ట్రైబల్ యువతకు అవకాశం ఇస్తున్నట్టు ట్రైబల్ డైరెక్టర్ బీఎం సంతోశ్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణకు చెందిన అర్హులైన గిరిజన నిరుద్యోగ యువతీ యువకుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు అప్లికేషన్ను పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో http://dsapponline.com/sds/form/register.php వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు. ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్ (ఆయిల్ అండ్ గ్యాస్), ఇండస్ట్రియల్ వెల్డర్ (ఆయిల్ అండ్ గ్యాస్ ), ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్, ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సుల్లో ఈ ట్రైనింగ్ ఉంటుందని డైరెక్టర్ చెప్పారు.
ఆరు నెలల పాటు ఇవ్వనున్న ట్రైనింగ్లో టెక్నికల్ డిప్లొమా పూర్తయిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు అర్హులని డైరెక్టర్ వెల్లడించారు. ఆరు నెలల పాటు ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్స్, యూనిఫామ్ సేఫ్టీ షూస్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తరువాత నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎన్సీబీటీఈ) ద్వారా సర్టిఫికెట్ ప్రదానం చేసి ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.
