శ్రీలంకకు రానివ్వం.. వస్తే రాళ్ల దెబ్బలు తప్పవు! షకీబ్‌కు వార్నింగ్ ఇచ్చిన మాథ్యూస్ సోదరుడు

శ్రీలంకకు రానివ్వం.. వస్తే రాళ్ల దెబ్బలు తప్పవు! షకీబ్‌కు వార్నింగ్ ఇచ్చిన మాథ్యూస్ సోదరుడు

శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 'టైమ్డ్ అవుట్' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. క్రికెట్  నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ చేసింది కరెక్టే అయినా అతనికి మద్దతిచ్చే వారే కరువయ్యారు. షకీబ్‌ క్రీడా స్ఫూర్తి పాటించలేదని కొందరు, అతను చేసింది ముమ్మాటికి తప్పని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే, మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

షకీబ్‌కు తమ దేశంలో స్వాగతం లేదన్న ట్రెవిన్ మాథ్యూస్.. వస్తే లంక అభిమానుల చేత రాళ్ల దెబ్బలు తప్పవని హెచ్చరించారు.  " ఈ ఘటన  జరగడం దురదృష్టకరం. మేము చాలా నిరాశ చెందాం. బంగ్లాదేశ్ కెప్టెన్‌కు క్రీడా స్ఫూర్తి లేదు. అలాంటి అతనికి శ్రీలంకలో స్వాగతం లేదు. కాదని ఏదేని అంతర్జాతీయ లేదా ఎల్‌పిఎల్ మ్యాచ్‌లు ఆడటానికి అతను ఇక్కడకు వస్తే, మా దేశ అభిమానులు రాళ్లు విసురుతారు. అభిమానుల చేత మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.." అని ట్రెవిన్ వార్నింగ్ ఇచ్చాడు.

ఏం జరిగిందంటే..?

సోమవారం ఢిల్లీ, అరుణ్‌జైట్లీ వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్  అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో(టైమ్డ్ అవుట్) ఔట్‌ అయ్యారు. నిర్ధేశించిన సమయానికి అనగా రెండు నిమిషాల్లోపు అతను బంతిని ఫేస్ చెయ్యనందుకు ఔట్ గా ప్రకటించారు. క్రికెట్ రూల్స్ పరంగా ఇది ఔటే అయినప్పటికీ.. అభిమానులు మాత్రం అంగీకరించడం లేదు.