
- ఆర్డర్లు పూర్తి చేయకుంటే బ్లాక్లిస్ట్లో పెడ్తరట!
- టెస్కో నిర్ణయంతో ఆందోళనలో సిరిసిల్ల నేతన్నలు
- బడా వ్యాపారులకు మేలు చేయాలనే కుటర్గా అనుమానం
- కరోనా ఎఫెక్ట్ తో ముందుకు సాగని వస్త్రోత్పత్తి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేతన్నలపై కరోనా ఎఫెక్ట్పడింది. ఓ వైపు కార్మికులు కరోనా బారిన పడుతుంటే మరోవైపు సాంచాలు అప్గ్రేడ్కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గడువులోగా బతుకమ్మ చీరల ఆర్డర్లు పూర్తి చేయకపోతే చిన్న తరహా పరిశ్రమలన్నీ బ్లాక్ లిస్ట్లో పెడతాం.. ఆర్డర్లు రద్దు చేస్తామంటూ చేనేత జౌళిశాఖ అధికారులు సిరిసిల్ల నేతన్నలతో సంతకాలు చేయించుకోవడంపై కార్మికవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సిరిసిల్ల నేత కార్మికుల పొట్ట కొట్టి బడా, టెక్స్టైల్పార్క్వ్యాపారులకు ఆర్డర్లు ఇచ్చే కుట్ర చేస్తున్నారని, ఇందుకోసం టెస్కోలో ఓ కీలక అధికారి ప్రయత్నాలు చేస్తున్నారని నేత కార్మికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇస్తోంది. ఈసారి కూడా రూ.320 కోట్ల ఆర్డర్ఇచ్చారు. 132 మ్యాక్ సంఘాలు,170 ఎస్ఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో 14 వేల సాంచాలపై చీరలను తయారు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులు రాత్రిబంవళ్లు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నారు. లాక్డౌన్కారణంగా పనిముట్లు లేక, టెక్నిషియన్లు రాకపోవడంతో సాంచాల అప్గ్రేడేషన్ నిలిచిపోయింది. 14 వేల సాంచాలకు 7 వేలు మాత్రమే అప్గ్రేడ్ అయ్యాయి. దీంతో బతుకమ్మ చీరల తయారీ ఆలస్యం కానుంది. మరోవైపు టెస్కో ఎస్ఎస్ఐ, మ్యాక్స్సంఘాలు ప్రభుత్వ రూల్స్ప్రకారం సెప్టెంబర్15లోగా ఆర్డర్లు పూర్తి చేసి ఇవ్వాలని అంగీకార పత్రాలపై సంతకాలు చేయించుకుంటోంది. పూర్తి చేయకుంటే సంఘాలను బ్లాక్ లిస్టులో పెడతామని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై పవర్ లూం, మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు చిమ్మని ప్రకాశ్, ప్రతినిధి బీమని రామచంద్రం నిరసన వ్యక్తం చేశారు. టెక్స్టైల్పార్క్వ్యాపారులతో పాటు సిరిసిల్ల బడా వ్యాపారులకు ఆర్డర్లు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, ఇందుకు ఓ కీలక అధికారి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్మికుల పొట్ట కొట్టవద్దని సర్కారుకు విన్నవించారు.
భయాందోళనకు గురి చేస్తున్నరు
సంఘాలను భయందోళనకు గురి చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. టెక్స్టైల్పార్క్కు ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారు. కరోనా కష్టకాలంలో ఇలా చేయడం సరికాదు. మంత్రి కేటీఆర్ కల్పించుకొని కార్మికులను న్యాయం చేయాలి. మేం ఒప్పంద పత్రాలు రాసివ్వం.
– చిమ్మని ప్రకాశ్, పవర్లూం, మ్యాక్ సంఘాల అధ్యక్షుడు
ముందు జాగ్రత్తగా అంగీకార పత్రాలు
ఆర్డర్లు సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలి. బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉం టుంది. అందుకే ఒక్కో సంఘం ఎంత ఉత్పత్తి చేస్తుంది.. దాని వివరాల కోసం అంగీకార పత్రాలు అడుగుతున్నం. ఎంత వస్త్రం ఉత్పత్తి అవుతుందో చూశాక మిగతా ఆర్డర్ ఎలా పూర్తి చేయాలనే దానిపై అధికారు లు నిర్ణయిస్తారు. సర్కార్ పేర్కొన్న గడువులోగా ఆర్డర్లు పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ అంగీకార పత్రాలు తీసుకుంటున్నం. ఇతరులకు ఆర్డర్లు ఇచ్చే ఆలోచన మాకు లేదు.
– అశోక్రావ్, డిప్యూటీ డైరెక్టర్, టెస్కో, రాజన్నసిరిసిల్ల