దారి మళ్లిన ‘స్మార్ట్’​ ఫండ్స్

దారి మళ్లిన  ‘స్మార్ట్’​ ఫండ్స్

కరీంనగర్‍ సిటీ, వెలుగు: కరీంనగర్​, వరంగల్​ స్మార్ట్​ సిటీ పనుల కోసం ఇచ్చిన సెంట్రల్​ గవర్నమెంట్​ ఫండ్స్​ ను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని  ఎంపీ, బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ బండి సంజయ్​ ఆరోపించారు. తాను ఒత్తిడి తేవడంతో ఇటీవల ఈ నిధులు ఇచ్చినా మ్యాచింగ్​ గ్రాంట్​మాత్రం ఇవ్వలేదన్నారు. సిటీలను స్మార్ట్​గామార్చేందుకు  ప్రధాని మోడీ ప్రయత్నిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో స్కీమ్​ నీరుగారిపోతోందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి హరదీప్ సింగ్ పూరి తో ఆయన గురువారం  భేటీ అయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మంత్రికి  వివరించారు. స్మార్ట్ సిటీ స్కీమ్​ కింద కరీంనగర్,  వరంగల్ లకు ఒక్కో దానికి రూ. 196 కోట్ల చొప్పున కేంద్రం ఫండ్స్​ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన అర్బన్ డెవలప్​మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్​లో తాను నిధుల దారి మళ్లించడంపై నిలదీయగా రాష్ట్ర అధికారులు  నీళ్లు నమిలారని  చెప్పారు. ఇటీవల ఆ నిధుల్ని  విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్​ను మాత్రం రిలీజ్​  చేయలేదన్నారు. స్మార్ట్​ సిటీ పనుల్లో నాణ్యత లేదని, ప్లానింగ్​ లేకుండానే పనులు చేస్తున్నారని చెప్పారు.