- తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే!
న్యూఢిల్లీ: మీకు తెలుసా?.. మనల్ని రోజూ... 24 గంటలపాటూ... ఎలక్ట్రానిక్ కళ్లు కనిపెడుతున్నాయని! మన ప్రతి అడుగునూ గమనిస్తున్నాయని. మనం ఏం తింటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎప్పుడు వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో... తెలుసుకుంటున్నాయని. ఇలా కనిపెట్టిన ఆ సమాచారాన్ని వేరేచోటికి చేరవేస్తున్నాయని.... మనకు సంబంధించిన అన్ని విషయాలూ ఇంటర్నెట్ డివైజ్లకు తెలిసిపోతున్నాయి. మనుషుల ప్రైవసీ పెద్ద డేంజర్లో పడుతోంది. టీవీ, ఫ్రిజ్, కారు, ఆఫీసు.. ఇవన్నీ మన జీవితాన్ని గమనిస్తున్నాయి. మన గురించి మొత్తం తెలుసుకుంటూ ఇంటర్నెట్ ద్వారా సమాచారం పంపిస్తున్నాయి.
మనం వాడే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు నెట్తో కనెక్ట్ కావడం వల్ల జీవితం సులువు అయిన మాట నిజమే అయినా ప్రైవసీ మాత్రం ఎగిరిపోయింది. యాప్స్ అన్నీ మనపై నిఘా వేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు..ఆఖరికి ఇండ్లు కూడా జీవితాల్లోకి తొంగిచూస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ డివైజ్లలో కొన్ని నెట్ లేకున్నా డేటాను కలెక్ట్ చేస్తాయి. ఆఫీసులు, మాల్స్, సిటీలు కూడా స్మార్ట్ అయిపోయాయి. అన్నింటిలోకి స్మార్ట్ డివైజ్లు చొచ్చుకుపోయాయ్. ట్రాన్స్పోర్ట్, రవాణా, వ్యవసాయం, ఇండస్ట్రీల్లోకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఎప్పుడో వచ్చేశాయ్. 2018 నాటికి 2,200 కోట్ల ఐఓటీ డివైజ్లు వాడకంలో ఉండగా, 2030 నాటికి వీటి సంఖ్య ఐదు వేల కోట్లకు చేరుతుందని అంచనా.
అన్ని డివైజ్లూ గూఢచారులే...
స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, వాయిస్ అసిస్టెంట్లు వాటి లెన్సులు, మైక్రోఫోన్ల ద్వారా వీడియోలు తీస్తాయి. శబ్దాలను రికార్డు చేస్తాయి. ఫలితంగా మనం ఉన్నచోటు, మనం మాట్లాడే మాటలు వేరే వాళ్లకు తెలిసిపోతాయి. స్మార్ట్టీవీలు కూడా గూఢచారుల్లా పనిచేస్తాయి. స్మార్ట్బల్బులు మన నిద్రను, గుండెలయను రికార్డు చేస్తాయి. స్మార్ట్వాక్యూమ్ క్లీనర్లు ఇంట్లోని వస్తువులను గుర్తించి మ్యాపింగ్ చేస్తాయి. కొన్ని వైఫై రూటర్లు యూజర్అడుగుజాడలను గుర్తించి ఇతర స్మార్ట్ డివైజ్లతో షేర్ చేసుకుంటాయి. ‘స్మార్ట్ డివైజ్లు డేటాను కలెక్ట్ చేస్తాయి కానీ మనుషులకు ఇవ్వవు’ అని కంపెనీలు చెప్పే మాటలు నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు అమెజాన్ వర్కర్లు అలెక్సా ద్వారా జరిగే సంభాషణలను వింటారు. ఆ సమాచారాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్నెట్ ద్వారా షేర్ అయ్యే డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ప్రైవసీ కోసం మన ఇంట్లోని స్మార్ట్ డివైజ్లను ఆఫ్ చేయొచ్చు కానీ ఆఫీసుల్లోని, మాల్స్లోని డివైజ్లు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. అందుకే స్మార్ట్ డివైజ్ లను కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అవగాహన పెంచుకోవాలె..
స్మార్ట్ హోం పర్సనల్ అసిస్టెంట్లు ఏయే డేటాను తీసుకుంటాయి.. వాటిని ఎక్కడ స్టోర్ చేస్తాయి.. దానిని ఎవరు తీసుకుంటారు.. ఇట్లాంటి విషయాలపై యూజర్లకు అవగాహన ఉండటం లేదు. కొన్ని దేశాల్లో స్మార్ట్ డివైజ్లు నిఘా వేయకుండా కఠిన చట్టాలు ఉన్నాయి. కంపెనీలు కూడా వీటిని పాటించాల్సి ఉంటుంది. డేటాను థర్డ్ పార్టీలకు ఇవ్వకూడదు. స్మార్ట్ డివైజ్ సక్రమంగా పనిచేయాలంటే దాని ఫర్మ్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం తప్పనిసరి. దాని సెటింగ్స్ను జాగ్రత్తగా గమనించాలి. డేటా కలెక్షన్ ఆప్షన్ను డిజబుల్ చేయాలి. ‘ది ఆన్లైన్ ట్రస్ట్ అలయన్స్’ వంటివి, డివైజ్లు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నెట్ ద్వారా టిప్స్ ఇస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకోవాలి. స్మార్ట్ డివైజ్ను కొనేముందే అది ఏ రకమైన డేటాను తీసుకుంటుందో తెలుసుకోవాలి. కంపెనీ డేటా మేనేజ్మెంట్ పాలసీని చదవాలి. దీని ఆధారంగా స్మార్ట్ డివైజ్ వెర్షన్ను ఎంచుకోవాలి.