- రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ఇండియా విభజన
- కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం
- వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాలు రెడ్ జోన్లో..
- కాస్త తక్కువ ప్రభావం ఉన్నవి ఆరెంజ్, గ్రీన్ జోన్లో..
- గ్రీన్ జోన్లో చిన్న పరిశ్రమలకూ అనుమతి ఇచ్చే చాన్స్
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. నమోదైన కేసుల ఆధారంగా, వాటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా డివైడ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ను పొడిగించాలని భావిస్తున్నందున అందుకు తగ్గట్టుగా ఈ జోన్లను వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ లాక్ డౌన్ అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, జిల్లాల్లో లాక్డౌన్ను కొనసాగిస్తారని, వైరస్ ప్రభావం అంతగా లేని జిల్లాలు, ప్రాంతాల్లో పాక్షిక మినహాయింపులు ఇస్తారని తెలిపాయి. ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొన్ని సెక్టార్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నాయి. శనివారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగించేందుకే మొగ్గు చూపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎకనామిక్ యాక్టివిటీని పెంచేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
లాక్ డౌన్పై ఏం చేద్దాం?
లాక్ డౌన్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ప్రజల ఆరోగ్యం, కరోనా కేసులను కట్టడి చేయాలంటే లాక్డౌన్ను కొనసాగించడమే మేలని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో కంపెనీలు, బిజినెస్లు మూతపడి.. ఎకనామిక్ యాక్టివిటీ పడిపోవడంతో అందరికీ ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు జాబ్స్ పోతాయన్న భయం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎకానమీని గాడిలో పెట్టాలంఏట లాక్డౌన్కు కొన్ని మినహాయింపులు ఇవ్వాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు జోన్ వైస్గా లాక్ డౌన్ అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. అటు లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. మరోవైపు ఎకనామిక్యాక్టివిటీని కూడా అనుమతించవచ్చని భావిస్తున్నారు.
రెడ్ జోన్:
రెడ్ జోన్లలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటిస్తారు. ఈ జోన్లలో ఎలాంటి యాక్టివిటీనీ అనుమతించరు. ఎవరూ అందులోకి ఎంటర్ కావడానికిగానీ, ఎగ్జిట్ కావడానికి గానీ కుదరదు. ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్న హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలు ఈ జోన్ కిందికి వస్తాయి.
ఆరెంజ్ జోన్:
తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు. వీటిలో తక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్కు అనుమతిస్తారు. వ్యవసాయ సంబంధ పనులకు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
గ్రీన్ జోన్:
అసలు కేసులు నమోదవ్వని ప్రాంతాలను గ్రీన్ జోన్గా చూస్తారు. ఆరెంజ్ జోన్ కంటే కాస్త ఎక్కవగా ఆంక్షలను సడలిస్తారు. కొన్ని చిన్న తరహా పరిశ్రమలను కూడా తెలిచేందుకు ఓకే చెబుతారు. అయితే సోషల్ డిస్టెన్స్ ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
