తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి , ఫైనాన్స్ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. దీంతో బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయించారు రిటైర్డ్ ఉద్యోగులు.
హైకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా ఫైనాన్స్ సెక్రటరీ వ్యక్తి గతంగా విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. అతను హాజరు కాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరునూరైనా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశమిచ్చింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ కార్యదర్శి హాజరు కాలేకపోయారని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది.మార్చి 23న ఈ రోజు అర్ధరాత్రి వరకు కోర్టు హాల్ లోనే ఉంటామమని హైకోర్టు ఈ సందర్బంగా తెలిపింది. వ్యక్తిగత హాజరు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
‘ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాము .కోర్టు ధిక్కరణ కింద నోటిసులు ఇచ్చి ఆరు నెలలు అయింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరించినట్లు వార్తలు వచ్చాయి . అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కదా ?. ముందే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సింది. కోర్టు ధిక్కరణ అంశాలు ఉపేక్షించేది లేదు’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
