
బ్రిటన్: ఇండియా, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతోంది. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జూన్ 28 నుంచి ఈ సిరీస్ మొదలైంది. ఇందులో భాగంగానే శనివారం (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది టీమిండియా. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి అతిథ్య ఇంగ్లాండ్పై 97 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. బ్యాటింగ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (62 బాల్స్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 112) సెంచరీతో చెలరేగి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది.
ఈ సెంచరీ ద్వారా స్టార్ బ్యాటర్ స్మృతి మందనా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియా తరుపున అన్ని ఫార్మాట్ల (టీ20, వన్డే, టెస్ట్)లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాటర్గా అరుదైన రికార్డ్ నెలకొల్పింది. టీ20 ఫార్మాట్లో మందనాకు ఇదే తొలి సెంచరీ కాగా.. వన్డే, టెస్టుల్లో ఇప్పటికే ఆమె పలు శతకాలు సాధించింది. తద్వారా భారత మహిళల క్రికెట్ చరిత్రలో అంతర్జాతీయ టీ20, వన్డే, టెస్ట్.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రేర్ ఫీట్ నెలకొల్పింది.
అంతేకాకుండా.. టీ20 ఫార్మాట్లో ఇంగ్లాండ్పై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ బెత్ మూనీ రికార్డ్ను కూడా స్మృతి మందనా సమం చేసింది. ఇప్పటి వరకు బెత్ మూనీ ఇంగ్లాండ్పై 8 హాఫ్ సెంచరీలు సాధించి టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. తాజా ఇన్సింగ్స్తో మందనా కూడా ఈ రికార్డ్ ను ఈక్వల్ చేసి మూనీతో పాటు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో ఐదు హాఫ్ సెంచరీలతో మెగ్ లానింగ్ మూడవ స్థానంలో ఉండగా, డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్, డేన్ వాన్ నీకెర్క్ తలా మూడు అర్ధ సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.