- అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన 8 మంది అరెస్ట్
- 900 కిలోలకు పైగా సరుకు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: గాజులు, పశువుల దాణా మధ్య గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల్లోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్, రాజేంద్రనగర్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో 900 కిలోలకు పైగా గంజాయి, ఓ డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాల ప్రకారం.. హర్యానాలోని హిసార్కు చెందిన జీవన్ సింగ్, చత్తీస్గఢ్కు చెందిన గోలు అంకిత్ సింగ్ ఒరిస్సా ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన గంజాయి సప్లయర్ పర్వేజ్సహకారంతో ఒరిస్సాలోని చంద్రశేఖర్ వద్ద నుంచి జీవన్ సింగ్, అంకిత్ 758 కిలోల గంజాయి కొన్నారు. ఒరిస్సాశివారులోని బోరిగుమ్మ వద్ద డీసీఎంలో లోడ్ చేసుకున్నారు. పశువుల దాణా బస్తాలతో కవర్ చేశారు. జీడిమెట్లలోని షాపూర్ మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్కు తరలిస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది. బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు జీడిమెట్ల పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. షాపూర్ బస్టాప్ సమీపంలో గంజాయి తరలిస్తున్న డీసీఎంను అడ్డుకొని జీవన్ సింగ్, అంకిత్ సింగ్ను అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్, పర్వేజ్ పరారీలో ఉన్నారు.
గాజుల బ్యాక్స్లో గంజాయి..
మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన బాలు, ప్రదీప్ ఫకీర సినాసత్ కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. ఒడిశాలోని బరంపూర్కు చెందిన మున్నా వద్ద గంజాయి కొని, మహారాష్ట్రకు తరలించేవారు. ఇందుకోసం బీడ్ జిల్లాకు చెందిన అనిల్ శ్యామ్రావ్, బాహు సాహెబ్, కమల్ శివాజీ, శాంతాబాయితోపాటు మరో మహిళతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. బాలు, ప్రదీప్ ఆదేశాలతో వీరు ఈ నెల 6న ఒరిస్సాకు వెళ్లారు. 144 కిలోల గంజాయిని 72 బాక్సుల్లో గాజులతో కలిపి ప్యాక్ చేశారు. ప్రైవేట్ బస్సులు, లారీల్లో గంజాయిని తరలిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తొండుపల్లి సమీపంలో వీరిని అదుపులో తీసుకున్నారు. 144 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కర్నాటక బీదర్కు చెందిన శివాజీ కాశీనాథ్ చౌహాన్ నుంచి 8 కిలోల గంజాయిని మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు.