
ప్రపంచ అగ్రదేశమైన అమెరికాను బాంబు మంచు తుఫాన్ గజగజ వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ మంచుతో న్యూయార్క్, బోస్టన్ సిటీలు అల్లాడిపోతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొలరెడో రీజియన్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. నెల రోజుల వ్యవధిలో మరోసారి బాంబు తుపాన్ విజృంభించడంతో నబ్రాస్కా, దక్షిణ డకోటా ప్రాంతాల్లో వందలాది స్కూళ్లు మూతపడ్డాయి. రోడ్లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో ఆఫీసులు, గవర్నమెంట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపై వెళ్లే వాహనాలు దాదాపు 1000 వరకు మంచులో కూరుకుపోయాయి. మంచులో కూరుకుపోయిన వాహనదారులను రక్షించేందుకు నేషనల్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టింది. మంచు తుఫాన్ కారణంగా డెన్వెర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేశారు.
ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోవడంతో భారీగా మంచు కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే పలు హైవేలను మూసివేశారు. భారీగా హిమపాతం పడటంతో నార్తరన్ విస్కోన్సిన్ మిచిగాన్, మిడ్ వెస్ట్, గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ డకోటాలో 25 అడుగుల మంచు పేరుకుపోయినట్లు వెదర్ సర్వీస్ మెట్రో లాజిస్ట్ స్టీవెన్ ప్లెజీల్ తెలిపారు. కెన్సాస్ సిటీలో గంట వ్యవధిలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎవరూ రోడ్లపైకి వాహనాలతో రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. పలురైల్వే మార్గాలను మూసివేశారు. న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితులు విధించారు.