ఖమ్మం రూట్ మార్చిన రియల్టర్లు​ ..సహకరిస్తున్న ఆఫీసర్లు!

ఖమ్మం  రూట్ మార్చిన రియల్టర్లు​ ..సహకరిస్తున్న ఆఫీసర్లు!

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు రియల్టర్లు రూట్​ మార్చారు. డీటీసీపీ అనుమతుల్లేని ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవడంతో మరో రూట్ ను ఎంచుకున్నారు. రైతుల నుంచి ఎకరాల్లో భూములను కొని ఫామ్​ ప్లాట్ల పేరుతో గుంటల్లో కస్టమర్లకు అమ్మేస్తున్నారు. 5, 10, 15 గుంటల చొప్పున అమ్ముతూ, మీకు వ్యవసాయ పాస్​ బుక్​ లు వస్తాయి, రైతు బంధు, రైతు బీమా కూడా వస్తుందంటూ కస్టమర్లను బుట్టలో పడేస్తున్నారు. వ్యవసాయేతర భూములను గుంటల్లో అమ్మకూడదన్న రూల్స్ ఉన్నా, వాటిలో లొసుగులను ఆధారంగా చేసుకొని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కింది స్థాయిలో రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ ​రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారు. ఇక ప్లాట్ల అమ్మకాల కోసం, వెంచర్​ ప్రమోషన్​ చేసేందుకు సరికొత్త మార్కెటింగ్ జిమ్మిక్​ చేస్తున్నారు. హైదరాబాద్​ తరహాలో ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇదే తరహాలో ఒక ప్రైవేట్ సంస్థ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. వెంచర్​ వేదికగా రెయిన్​ డ్యాన్స్, టమాటో ఫెస్టివల్ అంటూ యూత్​ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్​ అయితే ప్లాట్లు ఈజీగా అమ్ముడుపోతాయని ప్లాన్​ 
చేస్తున్నారు. 

మార్కెటింగ్ జిమ్మిక్కులు ఇలా..

ఖమ్మం రూరల్​ మండలం తీర్థాల రెవెన్యూ పరిధిలోని మంగళగూడెం సర్వే నెంబర్​ 620లో అవని ఇన్​ ఫ్రా ఆధ్వర్యంలో రివర్​ వ్యూ రిసార్ట్స్​ అండ్​ అగ్రి ల్యాండ్స్​ పేరుతో ల్యాండ్​ డెవలప్​ చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాల భూమిని మొదటి దశలో గుంటల లెక్కన ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. తర్వాత దశలో మరో 80 కూడా డెవలప్​ చేస్తామని, అప్పుడు మున్నేరు రివర్ వ్యూ ఉంటుందని కస్టమర్లకు చెబుతున్నారు. ఈ ప్లాట్లను అమ్మేందుకు వెంచర్​ ల్యాండ్​ లో మార్చి 8న హోలీ సందర్భంగా డ్యాన్స్​ ఈవెంట్, టమాటో ఫెస్టివల్​ ప్లాన్​ చేశారు. ఓ ఈవెంట్ మేనేజ్​మెంట్ సంస్థ ద్వారా హైదరాబాద్​ నుంచి మేల్, ఫిమేల్ డీజేలు, యాంకర్లను రప్పిస్తున్నారు. ప్లాట్లు కొనుక్కున్న వారికి ఎంట్రీ ఫ్రీ అని, లేకుంటే రిజిస్ట్రేషన్​ ఫీజుగా రూ.500గా నిర్ణయించారు. కలర్​ ఫుల్​ బ్రోచర్లు, వాల్​ పోస్టర్లను ప్రింట్ చేసి భారీగా పబ్లిసిటీ చేస్తున్నారు. స్తంభాద్రి అర్బన్​ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో అతి తక్కువ ధరకే ప్లాట్లు అంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మీరు కొన్న భూమిలోనే అగర్​వుడ్​ చెట్లు, మహాగని వృక్షాలను, పండ్ల మొక్కలను పెంచుతామంటూ అట్రాక్ట్ చేస్తున్నారు. 

సహకరిస్తున్న ఆఫీసర్లు!

గుంటల్లో అమ్మే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని ఆదేశాలు ఉన్నా, ఖమ్మం రూరల్​ రెవెన్యూ అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ సర్వే నెంబర్ లో ఇంతకుముందు భూమి లేకున్నా, కొత్తగా గుంటల్లో భూమిని పార్టేషన్​ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు 20కి పైగా ప్లాట్లు అమ్ముడుపోయాయని, ఇప్పుడు తక్కువ రేటుకు అమ్ముతున్నామని, ఈవెంట్ అయిపోయిన తర్వాత రేటు గజానికి వెయ్యి చొప్పున పెరుగుతుందంటూ మార్కెటింగ్ టీమ్​ కస్టమర్లకు చెబుతున్నారు. మార్చి 1 నుంచి రేట్లు పెరుగుతాయని, ముందే బుక్​ చేసుకోవాలంటూ తొందరపెడుతున్నారు. ​గుంటల్లో భూమి రిజిస్ట్రేషన్​ ఎలా అని ప్రశ్నిస్తే, అధికారులకు రూ.10వేలు అదనంగా ఇచ్చి తాము మేనేజ్​ చేస్తామంటూ సమాధానమిస్తున్నారు. దీన్ని బట్టి, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆఫీసర్ల సపోర్ట్  ఉందన్న విషయం అర్థమవుతోంది. అయితే ఈ రిసార్ట్స్​ ఏర్పాటు చేస్తున్న భూమిపైనా కొన్ని ఆరోపణలున్నాయి. వీటిని వికారుద్దీన్​ భూములు అంటారని, ఈ సర్వే నెంబర్​ లో సీలింగ్ ల్యాండ్స్​ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అసలు సీలింగ్ భూములు ఎలా పట్టా భూములుగా మారాయో తేల్చాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.