
మంచిర్యాల, వెలుగు: లాక్డౌన్ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆర్మీ పేరిట కొంతమంది యువకులు చేతిలో కర్రలు పట్టుకొని రాత్రివేళ పోలీసులతో కలిసి రోడ్లపై హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కొందరు ట్విటర్ ద్వారా రాష్ర్ట డీజీపీకి, సీఎంవోకు ఫిర్యాదు చేయడంతో విషయం హయ్యర్ ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐదుగురు పై ఎపిడెమిక్ డిసీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది..
లాక్డౌన్ సందర్భంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 25న ఎమ్మెల్యే చిన్నయ్య ఆర్మీ పేరిట కొంత మంది యువకులు స్వయానా వన్టౌన్ సీఐ తో కలిసి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో రాత్రి 10 గంటల సమయంలో గస్తీ తిరిగారు. చేతిలో కర్రలు పట్టుకొని రోడ్లపై ఓవరాక్షన్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ పత్రికలో వార్త రావడంతో కొంతమంది ట్విటర్లో రాష్ర్ట డీజీపీ, సీఎంవోలకు ట్యాగ్ చేస్తూ చిన్నయ్య ఆర్మీ, పోలీసుల తీరును ప్రశ్నించారు. అది మార్చి 25న జరిగిందనీ, వెంటనే తాను వారిని హెచ్చరించానని మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి చెప్పారు. కానీ సీఎంవో, డీజీపీ సీరియస్ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్188 కింద కేసు నమోదు చేశామని వన్టౌన్ సీఐ బి.రాజు వెల్లడించారు.
కేసు పెట్టాం: ఉదయ్ కుమార్ రెడ్డి, డీసీపీ
కోవిడ్19 కట్టడి చర్యల్లో భాగంగా వలంటరీ సర్వీస్ చేస్తామంటూ కొంతమంది యూత్ వచ్చారని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. మార్కెట్ ఏరియాలో పోలీసులతో ఫోటోలు దిగారని , అట్ల బయటకు రావద్దని వారికి సూచించి కేసు నమోదు చేశామన్నారు.