అత్తింటి వేధింపులకు అల్లుడు మృతి

అత్తింటి వేధింపులకు అల్లుడు మృతి

ఓ వైపు కుటుంబ కలహాలు, మరోవైపు అత్తింటి వేధింపులు.. ఇవన్నీ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య (37), జ్యోతి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. అయితే వెంకటయ్య ఆర్థికపరిస్థితి బాగాలేదని జ్యోతి గొడవపడేది. ఇదే విషయంపై దంపతులిద్దరికీ ఈ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి వెంకటయ్యను కొట్టించింది. అనంతరం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడం, బావమరుదులు కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య.. తన పొలం దగ్గర ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు బావమరుదులు కొట్టడం మరియు భార్య వెళ్లిపోవడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెంకటయ్య తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.