
- డబ్బులు ఇవ్వనందుకు అఘాయిత్యం
- నిజామాబాద్ జిల్లా పెంటకుర్థులో ఘటన
బోధన్,వెలుగు: డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లిని కొడుకు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపిన ప్రకారం.. బోధన్ మండలం పెంటకుర్థు గ్రామానికి చెందిన అంబం వెంకట్, చంద్రకళ(59) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కాగా.. 20 ఏండ్ల కింద దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అప్పట్లో వెంకట్ తన పిల్లలను తీసుకుని మహారాష్ట్రకు వెళ్లిపోయి అక్కడే నివసిస్తున్నారు.
చంద్రకళ సొంతూరిలోనే ఒంటరిగా ఉంటుంది. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చిపోతుండేవారు. చిన్న కొడుకు సురేశ్నాలుగు రోజుల కింద తల్లి వద్దకు వచ్చి డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం సురేశ్మద్యం తాగొచ్చి ఇంట్లో తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఆమె కాళ్లకు ఉన్న 40 నుంచి 50 తులాల వెండి కడియాలు తీసుకొని ఇంటి తలుపులు మూసిపెట్టి పారిపోయాడు. అయితే.. సోమవారం ఉదయం దాకా ఆమె కనిపించకపోవడంతో స్థానికులు అనుమానించి ఇంట్లోకి వెళ్లి చూడగా చనిపోయి కనిపించింది. దీంతో పంచాయతీ కార్యదర్శి బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విజయ్ బాబు తెలిపారు.