కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. జైపూర్ లోని అసెంబ్లీలో నామినేషన్ వేయగా ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ప్రస్తుతం రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనునన్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ కు దక్కనుంది.
గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నాయకురాలు సోనియా గాంధీ కానున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1964 ఆగస్టు నుండి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలిగా ఉన్నారు. కాగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి పోటీ చేయవచ్చని ఊహాగానాలు జోరందుకున్నాయి.
దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉండగా, బీజేపీ అత్యధికంగా 93, కాంగ్రెస్ 30, తృణమూల్ కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలకు 10 స్థానాలు ఉన్నాయి.